హైదారబాద్ : దేశం మనదే.. త్యాగం మనదే.. ఎగురుతున్న జెండా మనదే.. ఈ దేశభక్తి పాట వినని తెలుగువారుండరంటే అతిశయోక్తి కాదు. తెలుగు రాష్ర్టాల్లో స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఈ పాటను ప్రతీసారి వింటూనే ఉంటాం. ఇటువంటి ప్రముఖ పాట గాయకుడు జె శ్రీనివాస్ ఇటీవల కొవిడ్-19తో ఆకస్మికంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా ఆయన కుటుంబం తీవ్ర ఇక్కట్లలో ఉన్న విషయం తెలుసుకున్న టిటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల శుక్రవారం బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. వారితో మాట్లాడి యోగక్షేమాలను, సాదక బాధలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సందీప్ మక్తాల మాట్లాడుతూ.. పదో తరగతి చదువుతున్న జై శ్రీనివాస్ కూతురుకు తనకు నచ్చిన అంశంలో ఆన్లైన్లో శిక్షణ అందించనున్నట్లు హామీ ఇచ్చారు. దీంతో పాటు వారి కుటుంబ సమస్యలను మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేయనున్నట్లు భరోసా ఇచ్చారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జై శ్రీనివాస్ చిన్న కూతురు జైత్ర చక్కని గాత్రంతో పలు పాటలు ఆలపించింది. ఆ చిన్నారి గాత్రానికి ముగ్దుడైన సందీప్ మక్తాల బాలికను శాలువతో సత్కరించారు.
తమ కుటుంబం ఓ కిరాయి ఇంట్లో ఉంటుందని, కళాకారులకు చిత్రపురి కాలనీలో ఇళ్లు, స్థలాలు కేటాయించగా తాము ఈ మేరకు దరఖాస్తు చేసినప్పటికీ ఎలాంటి కేటాయింపులు జరగలేదని తెలిపారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని సందీప్ మక్తాల చెప్పారు. జై శ్రీనివాస్ కుటుంబానికి సాయం చేసేందుకు తమ కమిటీ త్వరలోనే సమావేశం కానుందని ఆయన వెల్లడించారు.