హైదరాబాద్ : జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) డిజిటల్ డిస్ కనెక్ట్… ఎన్విరాన్మెంట్ రీకనెక్ట్ పేరుతో వినూత్న కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రతిరోజూ రెండు గంటల చొప్పున వారంపాటు సోషల్ మీడియా సహా టెక్నాలజీ ఆధారితమైన అన్ని డిజిటల్ డివైజెస్లకు డిస్కనెక్ట్ అయి ఉండటం ఈ కార్యాచరణ సారాంశం. పర్యావరణం కాపాడేందుకు తీసుకున్న ఈ టాస్క్ కు సంబంధించిన లోగోను టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మఖ్తాల ఆవిష్కరించారు.
కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగడం, వర్క్ ఫ్రం హోం పోకడ పెరిగిన ప్రస్తుత తరుణంలో ప్రజలు ఫోన్, టీవీ, కంప్యూటర్/ ల్యాప్టాప్లకే అంకితమైపోయిన పరిస్థితి నేడు నెలకొంది. దీనివల్ల అనేక ఆరోగ్య, సామాజిక పరమైన సమస్యలు సంభవిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో వారు ప్రకృతితో మమేకం అయ్యేందుకు, కుటుంబ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు డిజిటల్ డిస్ కనెక్ట్... ఎన్విరాన్మెంట్ రీకనెక్ట్
పేరుతో టీటా ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ టాస్క్లో భాగంగా ప్రతి టెక్కీ వారంలో రోజూ 2 గంటల చొప్పున బిజినెస్ అవర్స్లలో అన్ని రకాలైన డిజిటల్ డివైజ్లకు దూరంగా ఉంటారు. ఈ సమయంలో చెట్లు నాటడం, వాటి సంరక్షణ, ఆర్గానికి వ్యవసాయం, టెర్రస్ గార్డెనింగ్ , పుస్తకాలు చదవడం, వ్యాయామం వంటివి చేస్తుంటారు. టెక్కీల శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేసే ఈ టాస్క్లో పాల్గొనేలా ఐటీ ఉద్యోగులను ప్రోత్సహించాలని కోరుతూ అన్ని కంపెనీల ప్రధాన కార్యాలయాలకు టీటా లేఖలు రాసింది.
డిజిటల్ డిస్ కనెక్ట్… ఎన్విరాన్మెంట్ రీ కనెక్ట్ లోగో ఆవిష్కరించిన టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మఖ్తాల ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ దినం సందర్భంగా తమ వంతు మద్దతు అందించేందుకు ఈ కార్యచరణ చేపట్టామన్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు, శారీరక, మానసిక, కుటుంబ సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఈ చొరవ ఉపకరిస్తుందన్నారు. దీంతో పాటుగా మనవంతుగా పర్యావరణానికి తోడ్పాటు అందించనవారం అవుతామని ఆయన అభిప్రాయపడ్డారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు.
డిజిటల్ డిస్ కనెక్ట్... ఎన్విరాన్మెంట్ రీకనెక్ట్
కార్యక్రమాన్ని ఉత్సాహవంతంగా తీర్చిదిద్దేందుకు జ్యూరీని టీటా ఏర్పాటు చేస్తోంది. ఈ జ్యూరీ ద్వారా కార్యక్రమంలో భాగమైన వారి సోషల్ యాక్టివిటీ పై అధ్యయనం చేసి పూర్తి చిత్తశుద్ధితో చేసిన వారికి బహుమతులు ఇవ్వనున్నారు. దీంతో పాటుగా భాగస్వామ్యులకు పత్రం అందజేయనున్నారు. ఆసక్తిగల వారు bit.ly/digital_disconnect లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. టీటా ఉపాధ్యక్షుడు రాణాప్రతాప్ బొజ్జం, రాష్ట్ర కార్యదర్శులు శ్రీలత చింతల, వెంకట వనం, దీపికి జోషి, అధికార ప్రతినిధి ప్రదీప్ నీలగిరి, తదితరులు ఈ కార్యాచరణలో క్రియశీల భాగస్వామ్యం పంచుకున్నారు.