బెంగాల్ మొత్తం సీట్లు టీఎంసీ బీజేపీ లెఫ్ట్ 1
292 214 76
తమిళనాడు మొత్తం సీట్లు డీఎంకే+ అన్నాడీఎంకే+ ఇతరులు
234 160 74 0
కేరళ మొత్తం సీట్లు ఎల్డీఎఫ్ యూడీఎఫ్ ఇతరులు
140 99 41 0
అస్సాం మొత్తం సీట్లు ఎన్డీయే కాంగ్రెస్+ ఇతరులు
126 77 45 4
పుదుచ్చేరి మొత్తం సీట్లు ఎన్డీయే కాంగ్రెస్+ ఇతరులు
30 16 9 5
12 గంటల వరకు సమాచారం ప్రకారం
దేవభూమి కేరళలో నాలుగు దశాబ్దాల సంప్రదాయాన్ని తిరగరాస్తూ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ సారథ్యంలో వామపక్ష ప్రజాతంత్ర కూటమి వరుసగా రెండో పర్యాయం గెలుపొందింది. 140 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో ఎల్డీఎఫ్ 99 స్థానాల్లో జయభేరి మోగించింది. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ 41 సీట్లకే పరిమితమైంది. ఈసారి ఎలాగైనా కేరళలో సత్తా చాటాలనుకున్న బీజేపీ కనీసం బోణీ కూడా చేయలేకపోయింది. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భావించిన మెట్రోమ్యాన్ శ్రీధరన్ సైతం పరాజయం పాలయ్యారు.
ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకున్నది. 126 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి 77 సీట్లు రాగా, కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమి 45 స్థానాలకే పరిమితమైంది. ప్రజలు తమపై విశ్వాసముంచి మరోసారి ఆశీర్వదించారని ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు.
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. 30 స్థానాలున్న శాసనసభలో ఎన్డీఏ కూటమి 16 స్థానాలు గెలుపొందింది. కాంగ్రెస్ నేతృత్వంలోని లౌకిక ప్రజాస్వామ్య కూటమి 8 స్థానాల్లో విజయం సాధించింది. మరో ఆరు చోట్ల ఇతరులు గెలుపొందారు.
దిగ్గజ నేతలు కరుణానిధి, జయలలిత లేకుండా జరిగిన ఈ ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే కూటమి విజయదుందుభి మోగించింది. మొత్తం 234 స్థానాలకు గానూ డీఎంకే కూటమి 160 స్థానాల్లో ముందంజలో ఉండగా, అధికార అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి 74 స్థానాలకే పరిమితమైంది. ఆ పార్టీ మిత్రపక్షం బీజేపీ నాలుగు చోట్ల ఆధిక్యంలో ఉన్నది. ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు అవసరం.
న్యూఢిల్లీ, మే 2: యావత్ దేశం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ అఖండ విజయాన్ని సాధించింది. బీజేపీ, తృణమూల్ మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో 214 స్థానాలను కైవసం చేసుకుని తృణమూల్ జయకేతనం ఎగురవేసింది. వీల్ చెయిర్లో కూర్చొనే చక్రం తిప్పిన దీదీ.. నందిగ్రామ్లో స్వల్పతేడాతో ఓటమిపాలయినప్పటికీ తన పార్టీకి ‘ఒంటికాలి’తో ‘హ్యాట్రిక్’ విజయాన్ని అందించారు. దీంతో ముచ్చటగా మూడోసారి ఆమె ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులూ ఒడ్డిన బీజేపీ డబుల్ డిజిట్కే పరిమితం కాగా, దశాబ్దాలపాటు రాష్ర్టాన్ని పాలించిన లెఫ్ట్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ కనుమరుగైంది. ఇక నాలుగు దశాబ్దాల సంప్రదాయాన్ని తిరగరాస్తూ కేరళలో ముఖ్యమంత్రి పినరాయి విజయన్ సారథ్యంలోని ఎల్డీఎఫ్ కూటమి వరుసగా రెండో పర్యాయం అధికారంలోకి వచ్చింది. తమిళనాడులో అధికార అన్నాడీఎంకేని గద్దెదించి డీఎంకే విజయబావుటా ఎగురవేయగా.. అస్సాంలో బీజేపీ మరోమారు అధికారాన్ని నిలబెట్టుకున్నది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమి విజయం సాధించింది. కరోనా సంక్షోభ సమయంలో నిర్వహించిన నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికల సంఘం కౌంటింగ్ నిర్వహించింది. ఎన్నికల్లో గెలుపొందిన మమతా బెనర్జీ, స్టాలిన్, విజయన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు.
పశ్చిమబెంగాల్లో మొత్తం 292 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ 214 స్థానాల్లో జయభేరి మోగించింది. గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డిన బీజేపీ 76 స్థానాలకే పరిమితమైంది. అయితే గత ఎన్నికల్లో మూడు స్థానాలే గెల్చుకున్న ఆ పార్టీ.. తన బలాన్ని గణనీయంగా పెంచుకోగలిగింది. ఇక రాష్ర్టాన్ని దశాబ్దాలపాటు పాలించిన వామపక్షాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. లెఫ్ట్ కూటమి కేవలం ఒక్కస్థానానికే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటునూ గెలుచుకోలేక చతికిలపడింది. తృణమూల్ను ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకొచ్చిన సీఎం మమతాబెనర్జీ.. తాను పోటీచేసిన నందిగ్రామ్లో మాత్రం పరాజయం పాలయ్యారు. తన మాజీ అనుచరుడు, ప్రస్తుత బీజేపీ నాయకుడు సువేందు అధికారి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. నందిగ్రామ్ ప్రజల తీర్పును స్వాగతిస్తున్నానని కౌంటింగ్ అనంతరం మమత పేర్కొన్నారు. అయితే అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. ఇక ఎన్నికల్లో టీఎంసీ 48.1 శాతం ఓట్లు సాధించగా, బీజేపీ 37.8 శాతం ఓట్లను సాధించింది.