న్యూఢిల్లీ, మార్చి 22: దేశీయ ఆటోమొబైల్ కంపెనీల్లో అతిపెద్దదైన మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) తన వాహన కొనుగోలుదారులకు షాక్ ఇవ్వనున్నది. ఏప్రిల్ నుంచి తన అన్ని మోడళ్ల వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఏడాది కాలం నుంచి తమ వాహనాల తయారీ ఖర్చులు విపరీతంగా పెరిగాయని, ముడి సామగ్రి ధరలు పెరగడమే ఇందుకు కారణమని రెగ్యులేటరీ ఫైలింగ్లో ఎంఎస్ఐ పేర్కొన్నది. ఈ అదనపు భారంలో కొంత భాగాన్ని కస్టమర్లపై మోపేందుకు వచ్చే నెల నుంచి వాహన ధరలను పెంచబోతున్నట్లు వివరించింది. మోడళ్లను బట్టి ధరల పెరుగుదలలో మార్పులుంటాయని తెలిపింది. అయితే ఈ ధరల పెరుగుదల ఎంత మేరకు ఉంటుందో మాత్రం వెల్లడించలేదు. ఉత్పత్తి ధరల పెరుగుదల వల్ల కంపెనీపై పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు ఎంపిక చేసిన కొన్ని మోడళ్ల వాహనాల ధరలను రూ.34 వేల వరకు పెంచుతున్నట్లు ఈ ఏడాది జనవరి 18నే ఎంఎస్ఐ ప్రకటించింది.