సిటీబ్యూరో, జూన్ 17(నమస్తే తెలంగాణ): రూ. 4 లక్షల రుణం ఇస్తామంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఓ అమాయకుడిని బుట్టలో వేసి రూ. 9.5 లక్షలు కొట్టేశారు. బిహార్కు చెందిన అనిల్కుమార్ నగరానికి వలసవచ్చి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో బజాజ్ఫైనాన్స్ నుంచి మాట్లాడుతున్నామని రుణం కావాలా అంటూ అడిగారు. తనకు రుణం కావాలంటూ తెలుపడంతో గుర్తింపు పత్రాలను వాట్సాప్లో సైబర్నేరగాళ్లు సేకరించారు. రూ. 4 లక్షలు రుణం వస్తుందంటూ నమ్మించారు. అయితే ముందుగా కొంత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని, ఆ తరువాత మీ ఖాతాలోకి నగదు బదిలీ చేసేందుకు కొంత నగదు డిపాజిట్ చూపించాలని, పన్నులు చెల్లించాలంటూ దఫ దఫాలుగా రూ. 9.5 లక్షలు వసూలు చేశారు. అయితే తమకు చెల్లించే మొత్తం రిజిస్ట్రేషన్ ఫీజు మినహా మిగతావన్ని నీ లోన్తో కలిపి తిరిగి వచ్చేస్తాయంటూ చెప్పడంతో డబ్బులు చెల్లిస్తూ వెళ్లాడు. ఎక్కువగా అప్పులు చేసి సైబర్నేరగాళ్లకు చెల్లిస్తుండటంతో అతని యజమాని ఏమి జరుగుతుందంటూ ఆరా తీశాడు. జరిగిన విషయం తెలుసుకొని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించడంతో బాధితుడు గురువారం సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బంజారాహిల్స్కు చెందిన సాయి ప్రసన్న తన వద్ద ఉన్న కుట్టుమిషన్ను అమ్మేందుకు ఓఎల్ఎక్స్లో పోస్టు చేసింది. తాము కొంటామంటూ ముందుకొచ్చిన సైబర్నేరగాళ్లు గూగుల్ పే క్యూఆర్ కోడ్స్ పంపి, డబ్బు పంపిస్తున్నామంటూ.. ఆమె ఖాతాలో నుంచి రూ. 1.46 లక్షలు కాజేశారు.
ఓల్డ్బోయిన్పల్లికి చెందిన దిలీప్ స్నేహితుడి వాట్సాప్ నంబర్ను సైబర్నేరగాళ్లు హ్యాక్ చేసి, ఆ నంబర్ నుంచి తనకు అత్యవసరంగా డబ్బులు కావాలంటూ దిలీప్కు మేసేజ్ పంపించారు. తన స్నేహితుడికి అవసరముందని రూ. 1.98 లక్షలు వెంటనే దిలీప్ అతడు సూచించిన ఖాతాలోకి బదిలీ చేశాడు. ఆ తరువాత అతడి స్నేహితుడికి ఫోన్ చేయడంతో అది మోసమని తేలింది.
తాము ఆర్మీ కోసం పనిచేస్తున్నామని తార్నాకకు చెందిన పీపీఈ కిట్ల వ్యాపారం చేసే గంగాధర్కు సైబర్నేరగాళ్లు ఫోన్ చేశారు. ఆర్మీకి రూ. 5.5 లక్షల విలువైన పీపీఈ కిట్లు కావాలని, ఆర్మీ విభాగం నుంచి నిబంధనల ప్రకారం నేరుగా డబ్బు చెల్లించేందుకు వీలు లేదని చెప్పారు. అయితే సగం మీరు తమ ఖాతాలోకి బదిలీ చేస్తే.. ఆ పై మొత్తం మేం మీకు బదిలీ చేస్తామంటూ నమ్మించారు. ఆ తరువాత రూ.10 తమ ఖాతాలోకి బదిలీ చేయాలని సూచించారు. వెంటనే రూ. 20 గంగాధర్ ఖాతాలోకి బదిలీ చేసి నమ్మకం కుదిరించారు. ఇలా అతడిని నమ్మిస్తూ రూ. 2.75 లక్షలు కొట్టేశారు.
మెహిదీపట్నంకు చెందిన అమీనాబేగం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఫేస్బుక్లో కూడా తన వివరాలను పొందుపరిచింది. ఆ వివరాలను చూసిన సైబర్నేరగాళ్లు ఆమెకు ఫోన్ చేసి యూఏఈలో టీచర్ పోస్టు ఖరారైందని చెప్పారు. అయితే జాబ్, వీసా అంటూ ఆమె వద్ద నుంచి రూ. 3 లక్షలు కాజేశారు.
నగరానికి చెందిన ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులు బ్లాక్ ఫంగస్ బారిన పడటంతో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించాడు. రోగికి అంపోటెరిసిన్ – బి ఇన్జక్షన్ బ్లాక్ ఫంగస్ చికిత్సకు కావాలని వైద్యులు సూచించడంతో, బాధితుడు ఆ ఇన్జక్షన్ కావాలంటూ ట్విట్టర్లో పోస్టు పెట్టాడు. ట్విట్టర్ పోస్టు చూసిన సైబర్నేరగాడు తమ వద్ద ఇన్జక్షన్లు ఉన్నాయని రూ. 40 వేలు పంపించాలంటూ సూచించడంతో బాధితుడు ఆ డబ్బు పంపించాడు. అయితే ఇంకా డబ్బు డిపాజిట్ చేస్తేనే ఇన్జక్షన్లు పంపిస్తానంటూ సైబర్నేరగాళ్లు డిమాండ్ చేస్తుండటంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఆయా ఫిర్యాదులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.