సిద్దిపేట : కూలీలతో వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి బోల్తాపడటంతో 18 మందికి గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారం వద్ద శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు కాల్వ పనులు కొనసాగుతుండగా, దీనిలో వనపర్తి జిల్లాకు చెందిన కూలీలు పనిచేస్తున్నారు. అయితే, సాయంత్రానికి కాల్వ పనులు ముగించుకొని సింగాటం వద్ద ఉన్న తాత్కాలిక శిబిరానికి టిప్పర్లో తిరుగు ప్రయాణమయ్యారు.
దాచారం వద్దకు రాగానే టిప్పర్ డ్రైవర్ ట్రాక్టర్ను ఓవర్ టేక్ చేసే క్రమంలో ఢీకొని అదుపుతప్పి పల్టీకొట్టింది. ప్రమాదంలో టిప్పర్లో ప్రయాణిస్తున్న 18 మందికి కూలీలకు గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నలుగురిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని యశోద దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి