టిమ్స్ దవాఖానను నెలకొల్పడంతోపాటు దానికి అవసరమైన వైద్యసిబ్బంది నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. తక్కువ సమయంలో నిష్ణాతులైన సుమారు 50 మంది వైద్యులు, 200 మంది నర్సింగ్ సిబ్బంది,20 మంది టెక్నీషియన్లు, 100 మంది ఇతర సిబ్బందిని నియమించింది.
కరోనా రెండో దశలో ఆక్సిజన్ అవసరత ఎక్కువగా ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వం టిమ్స్లో ఆక్సొజన్ ప్లాంట్ను ఏర్పాటుచేసింది.
కరోనా రోగులకు అవసరమైన అన్ని రకాల వైద్యపరీక్షలను జరిపేందుకు పెథాలాజికల్ ల్యాబ్, మైక్రోబయాలజీ ల్యాబ్లను ఏర్పాటుచేశారు. వీటితో పాటు సీటీ స్కాన్, అల్ట్రాసౌండ్ తదితర సౌకర్యాలను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు.
దేశవ్యాప్తంగా ఇటీవలే 170 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం అనుమతిస్తే ఒక్కటంటే ఒక్కటీ తెలంగాణకు దక్కలేదు! అయినా.. ఎవరో ఏదో చేస్తారని తెలంగాణ ప్రభుత్వం ఆగలేదు! రాష్ట్రంలో సాగునీటి సమస్యలు, సంక్షేమ లక్ష్యాలను పూర్తిచేసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు వైద్యరంగాన్ని పటిష్ఠంచేసే పనిపెట్టుకున్నది. ప్రత్యేకించి కరోనా కాలంలో ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువచేస్తున్నది. తెలంగాణ రాకముందు ఉస్మానియా, గాంధీ, కాకతీయ, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్ కాలేజీలే ఉండేవి.
కేసీఆర్ సీఎం అయ్యాక మహబూబ్నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేశారు. మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి, వనపర్తి, నాగర్కర్నూల్, మంచిర్యాల, జగిత్యాలలోనూ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయించారు. వీటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలూ రానున్నాయి. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా 500 పడకల దవాఖానలు నిర్మిస్తున్నారు. మందుల సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు సిద్దిపేట, వనపర్తి, మహబూబాబాద్, కొత్తగూడెం, నాగర్కర్నూల్, సూర్యాపేట, భువనగిరి, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, వికారాబాద్, గద్వాలలో కొత్తగా 12 సబ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): కరోనా తొలి దశలోనే దేశమంతా తాత్కాలిక దవాఖానలు ఏర్పాటుచేసి చికిత్స అందించగా తెలంగాణ ప్రభుత్వం ఏకంగా ఒక దవాఖానను ప్రత్యేకంగా కరోనా బాధితుల కోసం అందుబాటులోకి తెచ్చింది. అతి తక్కువ సమయంలో 1,261 పడకలతో సకల సదుపాయాలతో ఏర్పాటు చేసింది. కేసులు పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 1,800 పడకల సామర్థ్యం ఉన్న గాంధీ దవాఖానను పూర్తిస్థాయి కరోనా చికిత్స నోడల్ కేంద్రంగా ఏర్పాటు చేసింది. దీనికి అదనంగా అతి తక్కువ సమయంలోనే రోగులకు పూర్తిస్థాయి మెరుగైన వైద్యం అందించేందుకు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను ఏర్పాటుచేసింది. టిమ్స్లో తొలిదశలో 500 మంది, రెండో దశలో ఇప్పటివరకు 1,000 మంది కరోనా చికిత్స పొందినట్టు దవాఖాన వర్గాలు తెలిపాయి.
కరోనా చికిత్సకు ఒక పూర్తిస్థాయి శాశ్వత ప్రత్యేక దవాఖాన ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం గచ్చిబౌలిలో నిరుపయోగంగా ఉన్న క్రీడాకారుల వసతి గృహ సముదాయాన్ని ఎంచుకున్నది. దానిని కరోనా దవాఖానగా మార్చేందుకు ఆదేశాలు జారీచేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యాధికారులు ‘తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ పేరుతో ఆ స్పోర్ట్స్ హాస్టల్ను నెల రోజుల్లోపే టిమ్స్ దవాఖానగా రూపొందించారు. గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి 13 అంతస్థులున్న ఈ భవన సముదాయంలో అన్నిరకాల అత్యవసర వైద్య సదుపాయాలకు చకచకా ఏర్పాట్లుచేశారు. దవాఖాన ప్రారంభంతోనే 1,261 పడకలను ఏర్పాటుచేశారు. అందులో 960 పడకలకు ఆక్సిజన్, 137 పడకలతో ప్రత్యేక ఐసీయూ, 164 పడకలతో సాధారణ వార్డులను ఏర్పాటుచేశారు. రోగులకు అవసరమైన అన్నిరకాల వైద్య సదుపాయాలు, మౌలిక వసతులతోపాటు వైద్యసిబ్బందికి అవసరమైన సదుపాయాలను సైతం ఏర్పాటుచేశారు.