ఉస్మానియా యూనివర్సిటీ, మే 22: కంటికి కనబడని కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు సేవలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజలంతా సహకరించాలని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి పిలుపునిచ్చారు. వైరస్ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అలుపెరగని పోరాటం చేస్తోందని చెప్పారు. ఉద్యోగుల సేవలు ప్రజల కోసమేనని, దీనిని ప్రతిఒక్కరూ గుర్తించాలని సూచించారు. డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ విపత్కర సమయంలో ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కష్టపడుతుందన్నారు. క్లిష్ట సమయంలో విధులకు దూరం కాకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అధికారులు, డాక్టర్లు, వైద్య సిబ్బం ది, జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని కొనియాడారు. వైరస్ను కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధిస్తే ప్రజలు అర్థం చేసుకుని సడలింపు సమయంలోనే బయటకు రావాలని సూచించారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని, లేనిపక్షంలో ఇంట్లోనే ఉండి పోలీసులు, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.