హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): దిగువ, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని బిల్డర్లు నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టాలని రోడ్లు, భవనాలశాఖల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పుడే.. రియల్ ఎస్టేట్ రంగం సుస్థిరంగా ఉంటుందని పేర్కొన్నారు. రీజినల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్)తో రాష్ట్రంలో ఈ పరిశ్రమ మరింత పురోగమిస్తుందన్నారు. ఆర్ఆర్ఆర్తో హైదరాబాద్ విస్తరిస్తుందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ క్రెడాయ్ పదవ ఎడిషన్ ప్రాపర్టీ షో-2021ను హైటెక్స్లోని ఎగ్జిబిషన్హాల్లో ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ జాతీయ రహదారుల నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చును కేంద్రమే భరించాల్సిఉన్నప్పటికీ, ఆర్ఆర్ఆర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం భరించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని గుర్తుచేశారు. రియల్ఎస్టేట్ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రం నంబర్వన్గా ఉన్నదని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితోపాటు డెవలపర్లు, సంస్థల భాగస్వామ్యం ఇందుకు కారణమని మంత్రి వేముల పేర్కొన్నారు. నాణ్యమైన నిర్మాణాలను అందించే స్థాయికి ఈ రంగం ఎదిగిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంస్కరణలు, శాంతిభద్రతలు, 24 గంటల విద్యుత్తు, నిర్మాణ అనుమతుల్లో సంస్కరణలు దీని అభివృద్ధికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 15 వేల ఐటీ కంపెనీలొచ్చాయని వెల్లడించారు. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని కొనియాడారు.
రియల్ఎస్టేట్తోనే రాష్ట్ర జీడీపీ వృద్ధి
హైదరాబాద్లో విల్లాలు, అపార్ట్మెంట్లు, ఓపెన్ లేఅవుట్లు భారీగా వస్తున్నాయని, బిల్డర్లు, డెవలపర్లకు ప్రాధాన్యం పెరిగిందని మంత్రి వేముల అన్నారు. ఆయా ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు బ్యాంక్లు ముందుకొస్తున్నాయని చెప్పారు. రియల్ రంగం మెరుగ్గా ఉంటేనే రాష్ట్ర జీడీపీ పెరుగుతుందని తెలిపారు. ధరణి పోర్టల్తో సామాన్య రైతుల సమస్యలు తీరాయన్నారు. రియల్ఎస్టేట్ భూములకు సంబంధించిన 60 సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే 45 సమస్యలకు పరిష్కారం లభించిందని, మరికొన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తారని పేర్కొన్నారు. అనుమతుల కోసం అన్ని శాఖల కార్యాలయాలు తిరిగాల్సిన అవసరం లేకుండా టీఎస్-బీ పాస్ అమలుచేస్తామని, టౌన్ప్లానింగ్తోపాటు ఇతర శాఖలకు దరఖాస్తు వెళ్లేవిధంగా చర్యలు తీసుకొంటామని తెలిపారు. రెరాకు ప్రత్యేక భవనం కేటాయించి, రిటైర్డ్ జడ్జిని నియమించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నదని వెల్లడించారు. కార్యక్రమంలో క్రెడాయ్ జాతీయ ఉపాధ్యక్షుడు జీ రాంరెడ్డి, క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు సీహెచ్ రాంచంద్రారెడ్డి, తెలంగాణ డెవలపర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జీవీరావు, క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు పీ రామకృష్ణారావు, జనరల్ సెక్రెటరీ వీ రాజశేఖర్రెడ్డి, ఉపాధ్యక్షులు జీ ఆనంద్రెడ్డి, కే రాజేశ్వర్, ఎన్ జైదీప్రెడ్డి, బీ జగన్నాథరావు, కోశాధికారి ఆదిత్య గౌర, సంయుక్త కార్యదర్శులు శివరాజ్ఠాకూర్, కే రాంబాబు, పలువురు బిల్డర్లు, డెవలపర్లు పాల్గొన్నారు. ప్రాపర్టీ షో సందర్భంగా పలు రియల్ఎస్టేట్ సంస్థలు ఏర్పాటుచేసిన స్టాల్స్ను మంత్రి వేముల పరిశీలించారు.