హైదరాబాద్ : తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ల కొరతకు కేంద్రమే కారణమని రాష్ట్ర మంత్రి, కొవిడ్-19పై రాష్ట్రస్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్ కేటీఆర్ ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సిన్ల తయారీ కేంద్రంగా హైదరాబాద్ ఉన్నప్పటికీ సొంత ప్రజలకు టీకాలు వేసేందుకు కొరతను ఎదుర్కొవటం దురదృష్టకరమన్నారు. టీమ్ ఇండియా స్పిరిట్ గురించి ప్రధాని పదే పదే మాట్లాడుతుంటారు. ఇప్పుడు దాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
అనేక రాష్ట్రాలు ప్రజలకు టీకాలు వేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మహమ్మారిపై పోరాటం అనేది అసాధ్యమన్నారు. టీకా డ్రైవ్ను వేగవంతం చేయడమే ఇప్పుడు తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. వ్యాక్సిన్ల డిమాండ్ అధికంగా ఉందని కానీ సరఫరా మాత్రం దానికి సరిపడా లేదన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తోందన్నారు.
కేంద్రాన్ని కోటి వ్యాక్సిన్ డోసులు సరఫరా చేయాల్సిందిగా డిమాండ్ చేసినట్లు చెప్పారు. తయారీదారుల నుండి నేరుగా టీకాలు తీసుకునేందుకు తమకు అనుమతించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. పంజాబ్ సహా మరో ఏడు రాష్ట్రాలు కూడా ఇలాంటి అభ్యర్థనే చేశాయన్నారు. కానీ దీనిని భారత ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.