ములుగు : పులి చర్మంతో వ్యాపారం నిర్వహించే అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద అమ్మకానికి సిద్ధంగా ఉన్న పులి చర్మం కలిగిన ఇద్దరి వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను వాజేడు గ్రామానికి చెందిన తిరుమలేష్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా చండూరుకు చెందిన సత్యంగా గుర్తించారు. వీరి వద్ద నుండి పులి చర్మం, బైక్, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై అటవీ సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం అటవీశాఖ అధికారులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.
తిరుమలేష్ ఛత్తీస్గఢ్లో ఉండే తన బావ సాగర్ను కలుస్తూ టచ్లో ఉండేవాడు. కాగా ఒక నెల కిందట సాగర్ ఫోన్ చేసి తన వద్ద పులిచర్మం ఉన్నదని దాన్ని అమ్మేందుకు సహాయం చేయాలని తెలంగాణ రాష్ట్రంలో పులి చర్మం కొనే వారిని వెతికి పెట్టాల్సిందిగా కోరాడు. అనంతరం తిరుమలేష్ ఒక వ్యక్తిని సంప్రదించగా రూ. 30 లక్షలకు పులి చర్మం కొనేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. ఈ వివరాలు తిరుమలేష్ సాగర్కు చెప్పగా పులి చర్మం తిరుమలేష్కు ఇచ్చాడు. తిరుమలేష్ ఈ పులి చర్మమును సత్యం ఇంటిలో దాచి పెట్టాడు. అనంతరం ఈ రోజు దానిని అమ్మడానికి తిరుమలేష్, సత్యం ముళ్ళ కట్ట బ్రిడ్జి వద్దకు రాగానే పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ఏటూరునాగారం సీఐ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా అటవీ అధికారి ఇన్ఛార్జ్ ఎఫ్డీవో గోపాల్ రావు, ఇతర అధికారులు పరీక్షించి దాన్ని నిజమైన పులి చర్మం గా నిర్ధారించారు.