నాలుగో రోజూ కొనసాగిన లాక్డౌన్
ఉదయం 10 దాటాక నిర్మానుష్యంగా రహదారులు
లాక్డౌన్కు సంపూర్ణ సహకారం
నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు
ఆదిలాబాద్, మే 15 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా నాలుగో రోజు శనివారం లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం సడలింపు సమయంలోనే ప్రజలు బయటకు వచ్చి తమకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేశారు. ఉదయం 10 గంటల తర్వాత దుకాణాలు మూసివేశారు. ప్రజలు కూడా ఇళ్లకు చేరుకొని లాక్డౌన్కు పూర్తిగా సహకరించారు. ఉదయం పది గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అన్ని ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మంచిర్యాలలో సీపీ సత్యనారాయణ, ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం జిల్లాల్లో ఇన్చార్జి ఎస్పీలు రాజేశ్ చంద్ర, ప్రవీణ్కుమార్, సుధీంద్ర లాక్డౌన్ను పర్యవేక్షించారు. మంచిర్యాలలో డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి, లక్షెట్టిపేటలో ఏసీపీ మహాజన్ లాక్డౌన్ అమలుతీరును పరిశీలించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపనపల్లి వద్ద అంతర్రాష్ట్ర వంతెన వద్ద చెక్పోస్ట్ను సీపీ సత్యనారాయణ తనిఖీ చేశారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి అంబులెన్స్లకు అనుమతినిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే కరోనా బారిన పడిన మావోయిస్టులు లొంగిపోతే, వైద్యం అందించి పునరావాసం కల్పిస్తామని చెప్పారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి సరిహద్దు చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పలు కూడళ్లలో డీఎస్పీ ఉపేందర్ రెడ్డి లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో 65 బస్సులను వివిధ రూట్లలో నడిపించినట్లు డీవీఎం రమేశ్ తెలిపారు.