నల్లగొండ: రైతును రాజును చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ చెప్పారు. శాలీగౌరారం మండల కేంద్రంలోని సాగునీటి ప్రాజెక్టు నుంచి వర్షాకాలం పంటల కోసం ఆయన నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి, తాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే కేసీఆర్ సంకల్పమని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పుడు రాష్ట్రంలో బీడు భూములన్నీ పచ్చని పంటపొలాలతో కళకళలాడుతున్నాయని చెప్పారు. రైతులు లాభాసాటి వ్యవసాయంపై దృష్టిపెట్టేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు. మార్కెటింగ్ను దృష్టిలో పెట్టుకొని డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం ద్వారా రైతుల ఆదాయాలను పెంచాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ముందస్తు ప్రణాళికతో మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నింటిని పునరుద్ధరించుకోవడం జరిగిందన్నారు.
రైతులకు పుష్కలంగా సాగునీరు అందించడమే కాకుండా, రైతుబంధు పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తూ, గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడుతున్నదని ఎమ్మెల్యే కిషోర్ చెప్పారు. గత 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో 1,15,625 ఎకరాల్లో వరి పంటను సాగుచేస్తున్నారని పేర్కొన్నారు. నేడు శాలిగౌరారం ప్రాజెక్టు నుంచి పంట సాగు కోసం నీటిని విడుదల చేయడంవల్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గంట లక్ష్మమ్మ రాములు, జెడ్పీటీసీ ఎర్ర రణీల యాదగిరి, మార్కెట్ చైర్పర్సన్ కట్ట లక్ష్మి వెంకట్ రెడ్డి, PACS చైర్మన్ తాళ్లూరి మురళి, రైతు బంధు సమితి కోఆర్డినేటర్ గుండా శ్రీనివాస్, మార్కెట్ వైస్ చైర్మన్ శేఖర్ బాబు, మండల పార్టీ అధ్యక్షుడు ఐతగోని వెంకన్న, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.