జగిత్యాల : జిల్లాలోని కోరుట్ల పట్టణ శివారు ఎకిన్పుర్వాగులో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులను అధికారులు సురక్షితంగా రక్షించారు. ఎకిన్పుర్కు చెందిన మక్కర్ల విజయ్, సంఘంకు చెందిన ఇల్లెందుల శ్రీనివాస్, కోరుట్ల పట్టణం అయ్యప్పగుట్టకు చెందిన సవుస్ వరదనీటిలో చిక్కుకున్నారు. విజయ్, శ్రీనివాస్ చిన్న గడ్డపై ఆశ్రయం పొందగా సవుస్ రాయిపై కూర్చున్నాడు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు తెల్లవారుజామున ఈ ముగ్గురు కలిసి ఎకిన్పుర్-సంఘం గ్రామాల మధ్య ప్రవహించే వాగుకు వెళ్లారు. కాగా ఒక్కసారిగా వాగులో వరద ప్రవాహం పెరగడంతో సహాయం కోసం అరిచారు. వీరి అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఆర్డీవో వినోద్ కుమార్, డీఎస్పీ గౌస్ బాబా, తహసీల్దార్ సత్యనారాయణ, సీఐ రాజశేఖర్ రాజ్, ఫైర్ ఆఫీసర్ పి.లక్ష్మీనారాయణ, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాళ్లను రక్షించేందుకు ఈతగాళ్లను మోహరించారు. నలుగురు ఈతగాళ్లు ఈ ముగ్గురు చిక్కుకున్న ప్రదేశానికి చేరుకుని తాళ్ల సహాయంతో రక్షించారు. నాలుగు గంటలపాటు కొనసాగిన సహాయక చర్యలు మొత్తంమీద విజయవంతం అయ్యాయి.