బొంరాస్పేట, జూలై 22: వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో మూడు కొత్త మండలాలు ఏర్పాటు కానున్నాయి. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కొత్త మండలాల ఏర్పాటుకు ఇచ్చిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించారు. బొంరాస్పేట మండలంలోని దుద్యాల, నారాయణపేట జిల్లా పరిధి కోస్గి మండలంలోని గుండుమాల్, మద్దూరు మండలంలోని కొత్తపల్లిని కొత్త మండలాలుగా ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు డ్రాఫ్టు నోటిఫికేషన్ జారీచేయాలని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్రావు.. రెవెన్యూ అధికారులను గురువారం ఆదేశించారు. వీటితో కొడంగల్ నియోజకవర్గంలో మండలాల సంఖ్య ఎనిమిదికి చేరుకోనున్నది. వికారాబాద్ జిల్లాలో మండలాల సంఖ్య 20కి పెరగనున్నది.