విద్యానగర్, మే 20 : మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త ఆవిష్కరణలను చేయాలన్న కుతూహలం, అందుకు మన మేధస్సును, పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. రోజురోజుకూ సాంకేతికత అభివృద్ధి చెందుతున్నది. అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులకు అంతరిక్ష విషయాలపై అవగాహన కల్పించడం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆన్లైన్ తరగతులను నిర్వహించనున్నది. ఇది ఉపాధ్యాయులకు ఒక సువర్ణావకాశంగా చెప్పుకోవచ్చు. వారు నేర్చుకున్న విషయాలను విద్యార్థులకు బోధించడంతో వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసే ఉపయోగపడుతున్నది. ఇస్రో పరిధిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్ఎస్) ప్రత్యేకంగా ఉపాధ్యాయుల కోసం ఓ కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సును ఆన్లైన్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఆసక్తి ఉన్న వారు ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి.
శిక్షణలోని అంశాలు ఇవే..
అంతరిక్ష పరిశోధనతో పాటు సామాజిక అంశాలపై పాఠాలు బోధించనున్నారు. ఆర్థిక, సామాజిక అభివృద్ధి వాతావరణ సమాచారం, దూరవిద్య, పర్యావరణం, శీతోష్ణస్థితిపై అధ్యయనం, ఆహారం, నీటి భద్రత, ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన కల్పించనున్నారు. ఉపాధ్యాయులు వీటిని సద్వినియోగం చేసుకుంటే వీరితో పాటు విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. విద్యార్థులకు ప్రాజెక్టుల రూపకల్పన, నూతన ఆవిష్కరణలు సైన్స్బోధనలో ఉపయోగపడే అవకాశం ఉంది. ఇస్రో సంస్థ 2017 నుంచి ఆన్లైన్లో శిక్షణ కోర్సులు నిర్వహిస్తున్నది. అప్పటినుంచి ఇప్పటి వరకు 76 సార్లు శిక్షణ ఇచ్చారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 3.05 లక్షల మంది ఉపాధ్యాయులు శిక్షణ పొందారు.
జిల్లాలో 6500 మంది..
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు ఈ శిక్షణకు అర్హులు. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 1,084 ప్రభుత్వ, 174 ప్రైవేట్, 19 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. 4 వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, 2,500 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. భౌతిక, రసాయన, జీవ, గణితశాస్త్రం బోధించే ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ నెల 30 వరకు ఆన్లైన్లో http:// elearning.iirs. gov.in/ edusatregistration/student వెబ్సైట్లోకి వెళ్లి వివరాలను నమోదు చేసుకోవాలి. ఈనెల 31వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు 5 రోజుల పాటు తరగతులు ఉంటాయి. www.iirs. gov. in/eduatnews అనే లింక్ ద్వారా మొబైల్ ఫోన్, జీ మెయిల్ తదితర వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉపాధ్యాయులకు మెయిల్ ద్వారా ధ్రువపత్రాలను అందించనున్నారు.
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి..
ఉపాధ్యాయులకు అంతరిక్ష పరిశోధన సంస్థ వారు కల్పిస్తున్న ఈ శిక్షణను జిల్లాలోని భౌతిక, రసాయన, జీవ, గణిత శాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలి. ఈనెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ శిక్షణ భవిష్యత్తులో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది.
-సిద్ధిరాంరెడ్డి, కామారెడ్డి జిల్లా సైన్స్ అధికారి.