నిర్మల్ : హత్య, ఆత్మహత్యాయత్నాన్ని భగ్నం చేసిన మత్స్యకారులు అత్యంత సాహసంతో ముగ్గురు కుటుంబ సభ్యులను కాపాడి అందరి మన్ననలు పొందారు. బాసర పట్టణంలో సోమవారం ఉదయం గోదావరి నదిలో మునక వేసే ముందు నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రవీణ్ (40) తన ఇద్దరు కుమారులు అజయ్ (8), రివాన్స్ (5)ను నదిలోకి తోసేశాడు.
కుటుంబ గొడవలతో విసుగు చెందిన ప్రవీణ్ పిల్లలను కడతేర్చి తానూ బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఐదుగురు మత్స్యకారులు వేగంగా స్పందించి బాధితులు ముగ్గురినీ మునిగిపోకుండా కాపాడారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం యంచ గ్రామానికి చెందిన మత్య్సకారులు బొజారం, శ్రీకాంత్, పిట్టు, యోగి, రాజు సమయానుకూలంగా ధైర్య సాహసాలు ప్రదర్శించి బాధితులను కాపాడారు.
వీరు ప్రాణాలకు తెగించి బాధితులను కాపాడేందుకు చొరవ చూపకపోతే ముగ్గురు బాధితులు మరణించేవారని బాసర ఎస్ఐ మహేష్ చెప్పారు. స్వల్ప గాయాలైన ప్రవీణ్, అజయ్, రివన్స్లను బాసర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వారి ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.