భక్తుల కొంగుబంగారం లక్ష్మీనరసింహస్వామి
రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
నిత్య పూజలతో పెరుగుతున్న భక్తుల తాకిడి
రేగొండ, మార్చి 21: మహిమాన్విత క్షేత్రం కొడవటంచ. భక్తుల కొంగు బంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా నిత్య పూజలందుకుంటున్నాడు రేగొండ మండలంలో వెలిసిన లక్ష్మీనరసింహస్వామి. భక్తుల హృదయాల్లో కొలువైన స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. లక్షలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నెల 23 నుంచి వారం రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
రేగొండ మండల కేంద్రానికి 9 కిలోమీటర్లు దూరాన కొడవటంచ గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఈ నెల 23 నుంచి 30 వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూజారులు ప్రత్యేక పూజలు చేయనున్నారు. 23న బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా 24న స్వామివారి కల్యాణం, 25న గజవాహన సేవ, 26న సింహవాహన సేవ, 27న హనుమంతు సేవ, 28న బోనాలు తిరుగుట, పెద్ద రథోత్సవం, 29న మొక్కుల చెల్లింపులు, 30న అభిషేకం, నాగబలితో జాతర ముగుస్తుందని అర్చకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తల్తెకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు.