హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీ నిధులు రూ.64 కోట్లకు సంబంధించిన కుంభకోణం దర్యాప్తులో సీసీఎస్ పోలీసులు పలు కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలిసింది. 64 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను విత్ డ్రా చేసి నగదును హైదరాబాద్ నుంచి పలు దఫాలుగా వాహనాల్లో విజయవాడకు తరలించినట్టు నిందితులు బయటపెట్టారని సమాచారం. ఓ సందర్భంలో ముంబైకి కూడా డబ్బు పంపినట్టు తెలిసింది. ఇంత భారీ మొత్తంలో నగదును ఏ సమయంలో, ఏ వాహనాల్లో తరలించారు?, ఎవరెవరు ఎంతెంత పంచుకున్నారు?, నగదుతో ఎన్ని ఆస్తులు కూడబెట్టారనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల కోసం గాలింపును తీవ్రం చేశారు. కుంభకోణానికి సంబంధించి సీసీఎస్ పోలీసులు.. ఈడీతోపాటు ఐటీ అధికారులకు సమాచారం ఇవ్వనున్నట్టు తెలిసింది. మరోవైపు, ఈ కేసులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్వాన్ బ్రాంచిలో అప్పట్లో చీఫ్ మేనేజర్గా పనిచేసిన షేక్ మస్తాన్వలీని శనివారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.43 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించినవారితో షేక్ మస్తాన్వలీ కుమ్మక్కయ్యారని దర్యాప్తులో తేల్చారు. ఆ నిధులను యూనియన్ బ్యాంకు నుంచి డ్రా చేసి అగ్రసేన్ బ్యాంకులోని ఏపీ మర్కంటైల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఖాతాలోకి బదిలీ చేశారని గుర్తించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.