మహబూబ్నగర్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రైవేటీకరణ రూపం లో విద్యుత్తు రంగానికి ముప్పు ముంచుకొస్తున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ రంగాన్ని ఉరితీసేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన 1104 యూనియన్ 4వ, రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశంలో మంత్రులు జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఆవిర్భవించిన రోజున విద్యుదుత్పత్తి సామర్థ్యం 600 మెగావాట్లు ఉంటే ఇప్పుడది 16 వేల మెగావాట్లకు పెరిగిందని చెప్పారు. 70 మెగావాట్లకు పరిమితమైన సోలార్ ఇప్పుడు 4 వేల మెగావాట్లకు చేరిందన్నారు. వ్యవసాయ రంగానికి నాలుగేండ్లుగా నిరంతర ఉచిత విద్యుత్తు అందుతుందంటే దాని వెనుక కార్మికుల శ్రమ ఎంతో ఉన్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్లే విద్యుత్తు రంగంలో విజయాలు సాధ్యమైనట్టు వివరించారు.
రెండున్నరేండ్లలోనే చేసి చూపించాం:మంత్రి శ్రీనివాస్గౌడ్
70 ఏండ్లలో సమైక్య పాలకులకు చేతగానిది కేవలం రెండున్నరేండ్లలోనే కేసీఆర్ చేసి చూపించారని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సమైక్య రాష్ట్రం లో ఎప్పుడుపడితే అప్పుడు కరెంటు కోతలు విధించడంతో అన్ని రంగాలు కునారిల్లిపోయాయన్నారు. నాటి పాలకులు విద్యుత్తు రంగాన్ని ఏ మాత్రం ప ట్టించుకోకపోవడం వల్లే కరెంటు తీగలపై బట్టలు ఆరేసే దుస్థితి ఉండేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్తు రంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించి రికార్డు స్థాయిలో ఉత్పత్తిని పెంచినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల మాదిరిగానే విద్యుత్తునూ ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. ఈ సమావేశంలో టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, 1104 యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నూతన అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆదిలాబాద్కు చెందిన వెంకటేశ్వర్లును ఎనుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పద్మారెడ్డి పదవీకాలం ముగియడంతో నూతన అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లును, ప్రధాన కార్యదర్శిగా మహబూబ్నగర్కు జిల్లాకు చెందిన సాయిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్గా సుధీర్, అడిషనల్ జనరల్ సెక్రటరీలుగా శంకర్, వరప్రసాద్ను ఎన్నుకున్నారు.
విద్యుత్తుపై కేంద్రం తీరును ఎండగడతాం:టీఈఈఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ శివాజీ
విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ తీరును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ శివాజీ అన్నారు. శుక్రవారం ఖమ్మంలోని టీఎస్ ఎన్పీడీసీఎల్ గెస్ట్హౌస్లో నిర్వహించిన సంఘం ఖమ్మం సర్కిల్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్తు రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు చట్టాలు రూపొందిస్తుందని మండిపడ్డారు. విద్యుత్తు రంగాన్ని అంబాని, అదానీలకు ధారాదత్తం చేసేందుకే కొత్త చట్టాలు తీసుకొస్తున్నట్టు ఆరోపించారు. విభజన చట్టంలో తెలంగాణ ప్రాజెక్టులుగా ఉన్న శ్రీశైలం, పులిచింతల, నాగార్జునసాగర్, జూరాల హైడల్ విద్యుత్తు ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి నీటి పంపకాల సమస్యల్లో చేర్చి వాటిని స్వాధీనం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదన్నారు. ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్లను ఫ్రాంచైజీలుగా మార్చి బహుళ జాతి సంస్థలకు కట్టబెట్టేందుకు పావులు కదుపుతుందని ఆరోపించారు. ప్రైవేటీకరణ ఆలోచనను పునరాలోచించకపోతే కేంద్రంపై ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.