హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు, మేధావులు
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడి కోసం ఆంక్షలు తొలగించినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వీయ నియంత్రణ, కరోనా నిబంధనలను పాటించాలని సూచిస్తున్నారు. సెకండ్ వేవ్ నియంత్రణలోకి వచ్చినప్పటికీ ఇంకా పూర్తిగా పోలేదని, పోస్ట్ కొవిడ్ సమస్యలతో దవాఖానలకు వచ్చేవారి సంఖ్య ఎక్కువవుతున్నదని చెప్తున్నారు. మరోవైపు, థర్డ్ వేవ్ వస్తుందనే అంచనాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుండగా.. ప్రజలు తమవంతు బాధ్యతను నిర్వర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని నిపుణులు సూచిస్తున్నారు. మొదటి వేవ్ తరువాత ప్రజలు మరికొంతకాలం సంయమనం పాటించి అప్రమత్తంగా ఉంటే సెకండ్వేవ్ తీవ్రస్థాయిలో ఉండేదికాదని అభిప్రాయపడుతున్నారు.
ఇవి పాటించండి
మాస్కులు ధరించాలి. భౌతికదూరం పాటించాలి.
సమతుల్య ఆహారం, నీరు సమృద్ధిగా తీసుకోవాలి.
వ్యాయామం చేయాలి.
జనసమర్థంగల ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలి.
టీకా వేయించుకోవాలి.
శుభకార్యాలు తక్కువమందితోనే నిర్వహించుకోవాలి.
జాగ్రత్తలు పాటించకుంటే పెను ప్రమాదం
లాక్డౌన్ ఎత్తివేసినా జాగ్రత్తలు పాటించాలి. కరోనా పూర్తిగా పోలేదు. అజాగ్రత్తగా ఉంటే థర్డ్వేవ్ కన్నా ముందే కేసులు పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడు అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నది.