హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రజలకు కోతలు.. వాతలే ఇచ్చిందని ఆర్థికమంత్రి హరీశ్రావు విమర్శించారు. ద్రవ్యవినిమయబిల్లుపై శాసనమండలిలో జరిగిన చర్చకు మంత్రి శుక్రవారం సమాధానం ఇచ్చారు. కేంద్రప్రభుత్వం రాష్ర్టానికి వచ్చే పన్నుల వాటాశాతాన్ని 42 నుంచి 41కి తగ్గించిందని, దీం తో రూ.13,990 కోట్లు కోల్పోయామని చెప్పారు. అలాగే స్థానిక సంస్థలకు ప్రతి ఏటా వచ్చే నిధుల్లో రూ.699 కోట్లు కోత విధించిందని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తున్నదని.. పనితీరు సరిగ్గాలేని రాష్ర్టాలకు మాత్రం ప్రభుత్వ గ్రాంట్లు పెరిగాయని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు ఇవ్వాలని కోరామని, నీతిఆయోగ్ రూ.2,350 కోట్లు ఇవ్వాలని సూచించిందని, కానీ కేంద్రం ఇంతవరకు నయాపైసా ఇవ్వలేదని విమర్శించారు. 2014 నుంచి బీజేపీ ప్రభుత్వం 18 సార్లు పెట్రోల్, డీజిల్ పన్నులు భారీగా పెంచిందని చెప్పారు.
ప్రైవేటీకరించం
రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేసే ఆలోచన లేదని హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాకముందు నష్టాల్లోఉన్న విజయ డెయిరీ నేడు లాభాల్లో నడుస్తున్నదని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలను లాభనష్టాల దృష్టితో చూడ టం లేదని, వాటిని పేదలకు సేవలందించే సంస్థలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఆర్టీసీని పేద ల ప్రజల రవాణ సంస్థగా భావించి లాభనష్టాలతో సంబంధం లేకుండా బడ్జెట్లో రూ.3 వేల కోట్లు కేటాయించామని, ఆర్టీకి కార్మికులకు భద్రత కల్పించామని చెప్పారు. తమ ప్రభుత్వం కార్మికుల నమ్మకాన్ని చురగొన్నది తప్ప అమ్మకానికి పెట్టలేదన్నారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకుంటున్నదని, హైదరాబాద్ ఎయిర్పోర్టులో ఉన్న 13శాతం వాటాను కూడా అమ్ముకుంటున్నట్టు తెలిపిందని ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. అదే ఎయిర్పోర్ట్లో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న 13 శాతం వాటాను విక్రయించడం లేదని స్పష్టంచేశారు. హైదరాబాద్లో నిర్మించిన లక్ష డబుల్బెడ్ రూమ్ ఇండ్లను త్వరితగతిన అర్హులైన పేదలకు అందజేస్తామని హరీశ్రావు తెలిపారు.
త్వరలో ఉద్యోగాల భర్తీ
వ్యవసాయశాఖలో పెద్దఎత్తున పోస్టులు మంజూ రు చేసి నియామకాలు చేపట్టామని హరీశ్రావు తెలిపారు. తాజాగా 50వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. అవసరాలను బట్టి ఆయా శాఖలలో నియామకం చేపడుతున్నామని తెలిపారు. ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియ అని చెప్పారు. రాష్ట్రంలో 30వేల పదోన్నతులు ఇచ్చామని చెప్పారు.
బిల్లులకు ఆమోదం
ద్రవ్యవినిమయ బిల్లులను శాసనమండలి శుక్రవారం ఆమోదించింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్ చెల్లింపు సవరణ బిల్లు, ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ బిల్లులకు కూడా సభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు నాలుగు బిల్లులను శాసనమండలిలో ప్రవేశ పెట్టారు. బిల్లుల ఆమోదం అనంతరం చైర్మన్ గుత్తాసుఖేందర్రెడ్డి సభను నిరవధికంగా వాయిదా వేశారు.
శ్రీరాముడు అందరి వాడు
ఇతరుల మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం మంచిది కాదని హరీశ్రావు అన్నారు. శ్రీరాముడు అందరివాడని, తమ పార్టీ వాడన్నట్టుగా ప్రచారం చేయడం తగదని బీజేపీ నేత రామచందర్రావుకు హితవు చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ పాలితరాష్ట్రమైన యూపీలో చిన్నారులపై జరుగుతున్న అకృత్యాల గురించి ప్రస్తావించారు. ఆరేండ్లపాటు మండలి సభ్యునిగా ఉన్న రామచందర్రావు చర్చల్లో పాల్గొని, సలహాలు సూచనలు చేశారని అభినందించారు.