ఆదిలాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా నియంత్రణలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామస్థులు స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. మంగళవారం సర్పంచ్ మీనాక్షిగాడ్గే, ఎంపీటీసీ సుభాష్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామ సరిహద్దులో తాత్కాలిక చెక్పోస్ట్ను ఏర్పాటుచేశారు. ఇతర ప్రాంతాల నుంచి గ్రామంలోకి వచ్చేవారి వివరాలు నమోదు చేసుకొని, థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకున్న వారిని, మాస్కు ధరించిన వారినే గ్రామంలోకి రానిస్తున్నారు. కరోనా లక్షణాలుంటే వెంటనే దవాఖానకు తీసుకెళ్తున్నారు. ఇటీవల గ్రామంలో చేపట్టిన ఆరోగ్య సర్వేలో కరోనా కేసులు నమోదు కాలేదని, ఇందుకు తాము పాటిస్తున్న కట్టుదిట్టమైన నిబంధనలే కారణమని సర్పంచ్ తెలిపారు.