హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది పాక్షిక లాక్డౌన్ మాత్రమే. రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటలకు యథావిధిగా అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా కొందరు మంగళవారం గందరగోళానికి తెరతీసారు. దీంతో నిత్యావసర సరుకుల దుకాణాలు, సూపర్ మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు, వైన్ షాపులు కిక్కిరిసిపోయాయి. కొన్ని మీటర్ల వరకు జనాలు బారులు తీరారు. కొందరు పది రోజులకు సరిపడా కూరగాయలు కొనుగోలు చేయగా, మరికొందరు ఇష్టారీతిగా మద్యం కొనుగోలు చేసుకున్నారు. దీంతో గందరగోళపరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, కూరగాయలు, సరుకుల రవాణా యథావిధిగా కొనసాగుతుంది. లేనిపోని ఆందోళనలతో కృత్రిమ కొరతకు కారణం కావద్దు, ధరలు పెంచేందుకు కారణం కావద్దు. గతంలో లాక్డౌన్ సమయంలో ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకొని పాక్షిక లాక్డౌన్ ప్రకటించిన వెంటనే ప్రభుత్వం పూర్తి స్పష్టతనిచ్చింది. ప్రతి రోజు నాలుగు గంటల పాటు ప్రజలకు అవసరమైనవి యథాతధంగా తెరిచి ఉంటాయని పేర్కొన్నది. ప్రజలకు రవాణా ఇబ్బంది లేకుండా, ఆహారం కొరత లేకుండా కూరగాయలు, పాలు, ఇతర ముఖ్యమైన వాహనాలు ఎప్పుడైనా తిరిగేలా ఆదేశాలిచ్చింది. జాతీయ రహదారులపై రవాణా యథావిధిగా కొనసాగుతుంది. మద్యం కొరత రాకుండానూ సర్కారు చర్యలు తీసుకుంటున్నది.