ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
కల్యాణలక్ష్మి, పట్టా పాసు పుస్తకాల అందజేత
చేర్యాల, మార్చి 31 : తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు, మతాలకు చెందిన ఆడబిడ్డలు, రైతులు ఆనందంగా ఉండడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. పట్టణంలోని కల్యాణి గార్డెన్స్లో బుధవారం చేర్యాల మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన మహిళలకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రూ.1,84,21,344 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు 42 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశారు. ప్రభుత్వం, పార్టీ పై ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని, వారికి తగు విధంగా సమాధానం ఇవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏదో దుబ్బాకలో చావుతప్పి కన్నులొట్టబోయే విధంగా గెలిచినంత మాత్రాన విజయం కాదని, తాజాగా గెలిచిన ఎమ్మెల్సీ ఎన్నికలు సీఎం కేసీఆర్ వ్యూహానికి నిదర్శనమన్నారు.అనాగరికంగా కొందరు ప్రతిపక్ష నేతలు సీఎం కేసీఆర్పై చేస్తున్న విమర్శలు సరికావని, వెంటనే వాటిని మానుకోవాలని, లేని పక్షంలో తమ సత్తా చూపించాల్సి ఉంటుందన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజ యం సాధించడం ఖాయమన్నారు. రానున్న ప్రతి ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ వైపే తాము ఉంటామని సమావేశానికి వచ్చిన మహిళలు, రైతులు చేతులెత్తి అభివాదం తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి, ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, జడ్పీటీసీ శెట్టె మల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ వంగా చంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్నర్సయ్య, పుర్మ వెంకట్రెడ్డి, రైతుబంధు జిల్లా సభ్యుడు అంకుగారి శ్రీధర్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి, కౌన్సిలర్లు ఆడెపు నరేందర్, పచ్చిమడ్ల సతీశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, తహసీల్దార్ గైసున్నీసాబేగం, ఆయా గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.