సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 28 : కరోనా కష్టకాలంలో వైద్య సేవలకు ఎంత ఖర్చయినా వెనుకాడబోమని, సీఎం కేసీఆర్ ముందస్తు చర్యలే తెలంగాణకు శ్రీరామరక్ష అని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జనరల్ దవాఖానలో బుధవారం ఆయన కరోనా టీకా రెండో డోస్ను తీసుకున్నారు. అనంతరం దవాఖానలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులతో ఫోన్లో మాట్లాడారు. దవాఖానలో అందుతున్న వైద్యం, వసతులు గురించి వాకబు చేశారు. అదేసమయంలో ఉమ్మడి నల్లగొండ డీఎంహెచ్ఓలతో ఫోన్లో సమీక్షించారు. అక్కడి నుంచే నేరుగా వైద్య,ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్రావుతో మాట్లాడి సరిపడా వ్యాక్సిన్ను సరఫరా చేయాలని కోరారు. హెటిరో ఎండీతో ఫోన్లో సంప్రదించి తగినంత రెమ్డెసివర్ను పంపించాలని కోరారు. ఉమ్మడి జిల్లాలో కరోనా బాధితులకు సరిపడా బెడ్లు ఖాళీగా ఉన్నాయని, ఆక్సిజన్ సైతం సరిపడా ఉందని చెప్పారు. వ్యాక్సినేషన్పై అపోహాలు మాని అంతా వ్యాక్సినేషన్ తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒడిశా నుంచి వచ్చిన ఆక్సిజన్ ట్యాంకర్ ద్వారా దవాఖానలోని ఆక్సిజన్ ట్యాంకులో 5.6 కిలోలీటర్ల ఆక్సిజన్ను నింపించారు.