హైదరాబాద్ : తెలంగాణలో లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి ఈటల భేటీ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలెవరూ పుకార్లు నమ్మొద్దన్నారు. తెలంగాణలో లాక్డౌన్ ప్రసక్తే లేదని తెలిపారు. సాధారణ జీవితం కొనసాగించాల్సిందేనని అందరం కరోనాతో జీవించాల్సిందేనన్నారు. ప్రతి ఇల్లు ఔషధాలయంగా పనిచేయాలన్నారు.
కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఏపీ, మహారాష్ట్రలో కేసులు పెరిగాయి. హైదరాబాద్కు ప్రతి రోజు వేలాది మంది వస్తూ పోతుంటారు. దీని ప్రభావంతో తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నట్లు చెప్పారు. కేసుల సంఖ్య పెరిగినా, వైరస్ తీవ్రత తక్కువగా ఉందన్నారు. అయినప్పటికి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. స్వీయ నియంత్రణ, పరిశుభ్రత, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కొవిడ్ చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. కొవిడ్ చికిత్సకు పడకల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపు, ఫీజుల వసూళ్లపై ప్రైవేటు యాజమాన్యాలతో చర్చించినట్లు వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.