హైదరాబాద్ : వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మొక్కలు నాటే హరితహారం కార్యక్రమాన్ని త్వరలో చేపట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఆదివారం ప్రగతి భవన్లో జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయితీరాజ్ అధికారుల (డీపీవో) తో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతిని, అంశాల వారిగా వారు చేరుకున్న లక్ష్యాలను సీఎం సుధీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తాను చేపట్టబోయే ఆకస్మిక తనిఖీలు, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి లో మెక్కలు నాటడం తదితర కార్యక్రమాల పురోగతి తనిఖీలో భాగంగానే సాగుతాయని స్పష్టం చేశారు. ఇంతగా తాను సమావేశం నిర్వహించి వివరించినా తమ పనితీరు చక్కదిద్దుకోకపోతే క్షమించే ప్రసక్తే లేదన్నారు. తన ఆకస్మిక తనిఖీ నేపథ్యంలో పనితీరు బేరీజు వేసి కఠిన చర్యలుంటాయన్నారు. ఆ తర్వాత ఎవ్వరు చెప్పినా వినేదిలేదని అదనపు కలెక్టర్లకు, డీపీవోలకు సీఎం తేల్చి చెప్పారు.
జూన్ 20 న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అకస్మిక తనిఖీలుంటాయని సీఎం తెలిపారు. జూన్ 21 న వరంగల్ జిల్లాలో ఆకస్మిక తనిఖీలుంటాయన్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించి, నూతనంగా నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవఖానకు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం తెలిపారు.
కరోనా లాంటి వ్యాధుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్యరంగంలో మౌలిక వసతులను పూర్తి స్థాయిలో మెరుగుపరుస్తామని సీఎం తెలిపారు. ఇటీవలె 7 మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం జరిగిందని, వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలో అద్భుతమైన మల్టీ సూపర్ స్పెషాలిటి హాస్పటల్ ను దేశంలోనే మెరుగైన సౌకర్యాలతో నిర్మిస్తామని ప్రకటించారు.
వరంగల్లో విశాల ప్రదేశంలో నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానను 24 అంతస్తులతో అత్యంత ఆధునిక సాకేంతిక హంగులతో గ్రీన్ బిల్డింగ్ గా తీర్చిదిద్దాలని సీఎం తెలిపారు. అత్యవసర చికిత్సకోసం వచ్చే రోగుల కోసం దవాఖాన బిల్డింగ్ మీదనే హెలీకాప్టర్ దిగే విధంగా హెలీపాడ్ను నిర్మించాలన్నారు. కెనడా మోడల్ లో ధారాళంగా గాలి, వెలుతురు ప్రసరించే విధంగా క్రాస్ వెంటిలేషన్ పద్దతుల్లో హాస్పటల్ నిర్మాణముండాలన్నారు. అందుకు కెనడా పర్యటించి రావాలని అధికారులకు తెలిపారు.