పుణె: ఇంగ్లాండ్తో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. టీమ్ఇండియా నిర్దేశించిన 318 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌటైంది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ 66 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యం సాధించింది.
భారీ లక్ష్య ఛేదనలో జానీ బెయిర్స్టో(94: 66బంతుల్లో 6ఫోర్లు, 7సిక్సర్లు) ఇంగ్లాండ్కు శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ జేసన్ రాయ్(46: 35 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్)తో కలిసి తొలి వికెట్కు 135 పరుగులు జోడించాడు. రాయ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన బెన్స్టోక్స్ ఎక్కువ సేపు నిలువలేదు. వీరిద్దరినీ కృష్ణ పెవిలియన్ పంపాడు. బెయిర్స్టో మాత్రం తన దూకుడును కొనసాగించాడు. సెంచరీకి చేరువలో శార్దుల్ బౌలింగ్లో బెయిర్స్టో వెనుదిరగడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కకావికలమైంది. శార్దుల్, ప్రసిధ్ ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. శార్దుల్ ఒకే ఓవర్లో ఇయాన్ మోర్గాన్(22), జోస్ బట్లర్(2)లను పెవిలియన్ పంపడంతో భారత్ మ్యాచ్పై పట్టు సాధించింది. ఆఖర్లో నిలకడగా ఆడుతున్న మెయిన్ అలీని భువీ ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎక్కువసేపు పట్టలేదు. భారత్ బౌలర్లలో అరంగేట్ర బౌలర్ ప్రసిధ్ కృష్ణ నాలుగు వికెట్లు తీయగా..శార్దుల్ ఠాకూర్ మూడు, భువనేశ్వర్ కుమార్ రెండు, కృనాల్ పాండ్య ఒక వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా చాలా నిదానంగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఆచితూచి ఆడుతూ మెరుగైన స్థితికి చేరుకున్నాక దూకుడు పెంచింది.
ఏకంగా నలుగురు బ్యాట్స్మెన్ హాఫ్సెంచరీలతో విజృంభించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. శిఖర్ ధావన్(98:106బంతుల్లో 11ఫోర్లు,2సిక్సర్లు), విరాట్ కోహ్లీ(56: 60 బంతుల్లో 6ఫోర్లు), కేఎల్ రాహుల్(62 నాటౌట్: 43 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు), కృనాల్ పాండ్య(58 నాటౌట్: 31బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) వీరవిహారం చేయడంతో టీమ్ఇండియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 317 పరుగులు చేసింది.
హిట్మ్యాన్ రోహిత్ శర్మ(28) ఆరంభంలో ఫర్వాలేదనిపించినా శ్రేయస్ అయ్యర్(6), హార్దిక్ పాండ్య(1) విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్స్టోక్స్(3/34) కీలక సమయాల్లో వికెట్లు తీసి ఇబ్బందిపెట్టినా ఆఖర్లో రాహుల్, కృనాల్ విధ్వంసంతో లెక్కసరిచేశారు. ఆరో వికెట్కు ఈ జోడీ చివరి 57 బంతుల్లో 112 పరుగులు రాబట్టింది. మార్క్వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఒకానొక దశలో భారత్ ఐదు ఓవర్ల వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయింది. 41వ ఓవర్లో హార్దిక్ ఔటైన తర్వాత భారత్ కనీసం 250 మార్క్ దాటుతుందా అనిపించింది. చివర్లో ముఖ్యంగా కృనాల్ తన తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్లో అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు చేసి భారత్కు అనూహ్య స్కోరు అందించాడు.