న్యూఢిల్లీ: వ్యాక్సిన్లు అందుబాటులో లేనందుకు ప్రభుత్వంలో ఉన్న తాము ఉరేసుకోవాలా? అని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ ప్రశ్నించారు. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో కరోనా వ్యాక్సినేషన్కు అన్ని రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా టీకాలకు కొరత ఏర్పడింది. రాష్ట్రాల డిమాండ్ మేరకు వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వం, ఉత్పత్తి సంస్థలు సరఫరా చేయలేకపోతున్నాయి. దీంతో వ్యాక్సినేషన్ కేంద్రాలను రాష్ట్రాలు మూసివేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ప్రెస్మీట్లో టీకాల కొరతపై ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సదానంద గౌడ ఇలా బదులిచ్చారు. “దేశంలోని ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని కోర్టు మంచి ఉద్దేశంతో చెప్పింది. నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను, ఇంత సంఖ్యలో టీకాలు ఇవ్వాలని కోర్టు ఒకవేళ రేపు చెబితే, ఆ మేరకు టీకాలు ఉత్పత్తి కాకపోతే, ప్రభుత్వంలో ఉన్న మేము ఉరి వేసుకోవాలా? ” అని ప్రశ్నించారు.
రాజకీయ లబ్ధి కోసమో లేదా మరో కారణంతోనో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడంలేదని సదానంద గౌడ అన్నారు. ప్రభుత్వం తన పనిని ఎంతో నిబద్దత, నిజాయితీతో చేస్తున్నదని తెలిపారు. కొన్నిసార్లు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. “ఆచరణాత్మకంగా కొన్ని విషయాలు మా నియంత్రణకు మించినవి, మేము వాటిని ఎలా చేయగలం?” అని ఆయన ప్రశ్నించారు. అయితే వ్యాక్సిన్ల సరఫరా కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నదని, మరో రెండు రోజుల్లో పరిస్థితి మెరుగవుతుందని గౌడ వెల్లడించారు.