న్యూఢిల్లీ : దేశ రాజధానిలో నేరాలకు బ్రేక్ పడటం లేదు. రూ 50 ఇవ్వలేదనే ఆగ్రహంతో తండ్రిని కన్నకొడుకు కత్తితో పొడిచి చంపిన ఘటన ఢిల్లీలోని భరత్ నగర్ లో గురువారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిరుద్యోగి అయిన కొడుకు అనిల్ నిత్యం డబ్బులు ఇవ్వాలని తండ్రి(70)పై ఒత్తిడి తెస్తుండేవాడు. ఈ క్రమంలో రూ 50 ఇవ్వాలని తండ్రిని అడగ్గా ఆయన నిరాకరించడంతో ఛాతీపై కత్తితో దాడి చేశాడు.
బాధితుడిని మహేంద్ర పాల్ గా గుర్తించారు. తరచూ డబ్బులు అడుగుతుండటంతో ఉద్యోగం చూసుకోవాలని తండ్రి హితవు పలకగా ఆవేశంతో కత్తితో ఆయనపై దాడికి తెగబడ్డాడని అనిల్ తల్లి పేర్కొన్నారు. కొడుకును వారించేందుకు ప్రయత్నించిన తనపై కూడా దాడి చేయగా స్వల్ప గాయాలతో బయటపడ్డానని చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.