హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఎవరైనా గుడికెళ్తే గంటకొట్టి దేవున్ని ప్రార్థిస్తారు. కానీ, ఓ దొంగ అర్ధరాత్రి ఆలయాల్లోకి చొరబడి ఆ గంటలనే కొట్టేశాడు. హైదరాబాద్ శివారులో 12 దేవాలయాల్లో గంటలను ఎత్తుకెళ్లి, పాత సామాన్ల దుకాణాల్లో అమ్మేసి జల్సాలు చేశాడు. అతడిని ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పహాడిషరీఫ్ జల్పల్లి బొంబాయి కాలనీ గవర్నమెంట్ కాంప్లెక్స్ ప్రాంతానికి చెందిన పిట్టల రోహిత్ మద్యం తాగుతూ చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం బాలాపూర్, పహాడిషరీఫ్, యాచారం, ఆదిబట్ల, చాంద్రాయణగుట్ట, శాలిబండ, ఫలక్నుమా, శంషాబాద్ తదితర ప్రాంతాల్లోని దేవాలయాల్లో చోరీకి పాల్పడ్డాడు. బంగారు, వెండి ఆభరణాలతోపాటు ఇత్తడి గంటలను ఎత్తుకెళ్లేవాడు. పాత సామాన్లు కొనేవారికి గుడిగంటలను సామాగ్రిని కొంటామని ఆటోల్లో తిరిగేవారికి గంటలను అమ్మి జల్సాలు చేసేవాడు. గుడిలొ దొంగతనం చేయడానికి ముందుగా ద్విచక్రవాహనం చోరీకి పాల్పడేవాడు. గుడిలో చోరీ చేయగానే.. ఆ బైక్ను అమ్మేసేవాడు. గుడిగంటల చోరీపై రాచకొండ పోలీసులకు అందిన ఫిర్యాదుల మేరకు.. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా రోహిత్ను పట్టుకున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలోని 12 దేవాలయాల్లో చోరీలు చేయగా.. 4 బైక్లను ఎత్తుకెళ్లాడు. పోలీసులు నిందితుడు నుంచి రూ.6.50 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.