ఖైరతాబాద్, ఆగస్టు 28: తీన్మార్ మల్లన్న జర్నలిస్టు కాదని, ఓ బ్లాక్ మెయిలర్ అని క్యూన్యూస్ మాజీ బ్యూరో చీఫ్ చిలుక ప్రవీణ్ విమర్శించారు. అతనిది హీరోయిజం కాదని, పైశాచిక ఆనందమని పేర్కొన్నారు. అమ్మాయిలను బ్లాక్మెయిల్చేసి వారి జీవితాలను రోడ్డున పడేసిన చరిత్ర అతనిదని మండిపడ్డారు. తోటి బాధిత టీమ్ సభ్యులతో కలిసి శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ.. మల్లన్నకు ప్రశ్నించడానికి, పైశాచిక ఆనందానికి తేడా తెలియదని విమర్శించారు. మల్లన్న మాటలు విని పాతబస్తీలో ఓ యువకుడు ప్రస్తుతం మతితప్పి ఎర్రగడ్డ దవాఖానలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ఇప్పటికైనా తీన్మార్ మల్లన్న టీమ్లోని సభ్యుల తల్లిదండ్రులు మేల్కోవాలని కోరారు. ఈ సైకో మాటలు విని మీ పిల్లలు పిచ్చోళ్లవుతున్నారని, వారు సొంతంగా ఆలోచించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. అతనిపై చట్టపరంగా విచారణ జరుగుతున్నదని, ఇందుకు బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీలు సహకరించాలని కోరారు. మల్లన్నపై లైంగిక వేధింపుల కేసులు సైతం ఉన్నాయని తెలిపారు. అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, ముఖ్యమంత్రిని తిడితే ఫోకస్ అవుతానని ప్రయత్నిస్తున్నాడని తెలిపారు.
బినామీల పేరిట ఆస్తులు
తీన్మార్ మల్లన్న అక్రమంగా సంపాదించిన డబ్బు, ఆస్తులు బినామీల పేరిట పెడతాడని, బినామీల్లో నాగరాజుగౌడ్, దాసరి భూమయ్య, రజనీకుమార్, రంగయ్య, చింతపండు వెంకటేశ్వర్లు, ఉపేందర్ ఉన్నారని చిలుక ప్రవీణ్ వివరించారు. అబద్ధం మాట్లాడితే, నవ్వితే, నడిస్తే, రూపం దాల్చిస్తే, ఉన్మాదిగా ప్రవర్తిస్తే, సైకో తత్వందాలిస్తే అది తీన్మార్ మల్లనేన్నని విమర్శించారు. అతను ఆన్లైన్లో ఓ పేపర్ చదవడానికి రూ.30 లక్షలు తీసుకుంటాడని ఆరోపించారు. డబ్బులు ఇచ్చి పాదయాత్రలు నిర్వహిస్తాడని మల్లన్న టీమ్ సభ్యుడు చిలుక ప్రశాంత్ పేర్కొన్నారు. అతని అరెస్టు సరైందేనని, అలాంటి క్రిమినల్ను సమాజంలో తిరగకుండా చట్టపరంగా శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. మల్లన్న డబ్బులు తీసుకుంటాడనేందుకు ఆధారాలు ఉన్నాయని క్యూన్యూస్ కెమెరామెన్ చుక్క చంద్రశేఖర్ తెలిపారు. ఆఫీసులోనే సెటిల్మెంట్లు నడిచేవని పేర్కొన్నారు. సమావేశంలో నల్లగొండ మాజీ టీమ్ సభ్యుడు విశ్వనాథ్, కిశోర్, అశోక్, మందకిషన్ పాల్గొన్నారు.