బెంగళూర్ : ఇల్లు ఖాళీ చేస్తున్న సమయంలో వివాదం నెలకొనడంతో ఇంటి యజమాని, అతని కుమారుడు తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఇరానియన్ మహళ (29) పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని జేపీ నగర్ లో గజల్ సనై ఇంటిని ఖాళీ చేస్తూ సామాన్లను వాహనంలోకి ఎక్కించాలని ప్యాకర్స్ ను కోరారు. ఇంతలో అక్కడకు చేరుకున్న ఇంటి యజమానిని తాను చెల్లించిన అడ్వాన్స్ రూ 15,000ను వెనక్కి ఇవ్వాల్సిందిగా ఆమె కోరారు. దీంతో రూ 10,000 మాత్రమే తిరిగిఇచ్చాడు. తాను చెల్లించిన మొత్తం వెనక్కి ఇవ్వాలని సనై కోరగా రూ 500 చేతిలో పెట్టి మిగిలిన మొత్తంతో రిపేర్ పనులు చేయిస్తానని బదులివ్వగా ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది.
ఇంటి యజమాని తన కొడుకుతో కలిసి ఆమెను అసభ్యంగా దూషిస్తూ ఆమె ముఖంపై, కడుపులో పిడిగుద్దులతో దాడి చేశారు. బాధితురాలి బాయ్ ఫ్రెండ్ తో పాటు స్థానికులు ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు అదే ప్రాంతంలో పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకుని ఘర్షణ పడుతున్న వారిని విడదీసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో మహిళ ఏఎస్ఐపై చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది. అయితే ఏఎస్ఐ తనను అభ్యంతరకరంగా తాకడంతోనే తాను ఆయనను కొట్టానని మహిళ చెబుతున్నారు. ఘటన నేపథ్యంలో మహిళతో పాటు తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు.