సూర్యాపేట, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): వరి సాగులో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేసారంలో ధాన్యం కొనుగోలు కేంద్రం, రైతు వేదిక భవనాన్ని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. వానకాలం కంటే యాసంగిలో ఎక్కువ సేద్యం చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. వ్యవసాయ రంగాన్ని, రైతులను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. మిర్చితోపాటు కంది, నూనె గింజల పంటలకు అధిక డిమాండ్ ఉన్నదని, రైతులు ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో దొడ్డు రకం వడ్లను సాగు చేయొద్దని, భవిష్యత్తులో అమ్ముడుపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. భిన్నమైన పంటల వైపు దృష్టిసారించాలని, ఆయిల్ పామ్ సాగుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా అనుకూలంగా ఉన్నదని తెలిపారు. సూర్యాపేటలో సుమారు 2వేల ఇండ్లపై కూరగాయల పంటలు పెంచుతున్నారని, మిద్దె పంటలకు సూర్యాపేటను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
రైతు ఆర్థిక బలోపేతమే లక్ష్యం: జగదీశ్రెడ్డి
ప్రతి రైతును ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా రికార్డు స్థాయిలో నాలుగేండ్ల వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా రైతులంతా లాభదాయకమైన వ్యవసాయం చేయాలని కోరారు. కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్రావు తదితరులు పాల్గొన్నారు.
దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ: మంత్రి పువ్వాడ అజయ్కుమార్
కోటి ఎకరాల్లో వరి సాగు చేయడం ద్వారా దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ వెలుగొందుతున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల, పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కుప్పెనకుంటలో మంత్రి పువ్వాడ కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. దేశంలో అన్ని రాష్ర్టాల కన్నా మిన్నగా ధాన్యం ఉత్పత్తి చేయడమే కాకుండా 55 లక్షల టన్నుల ధాన్యాన్ని ఎఫ్సీఐకి అప్పగిస్తున్న ఘనత తెలంగాణదేనన్నారు. ప్రభుత్వం మంగళవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 6 వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.