హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఎకరాకు ఏకంగా రూ.1.20 లక్షల రుణం సదుపాయం కల్పించనున్నది. ఈ మేరకు బ్యాంకులకు రుణాలు ఇవ్వాలని కోరింది. ఇప్పటికే ఈ పంటను సాగుచేసే రైతులకు ఎకరాకు రూ.30 వేలు సబ్సిడీ ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అదనంగా రైతులకు రుణ సదుపాయం కూడా కల్పించాలని సర్కారు నిర్ణయించింది. ఈ లెక్కన రైతు ఎన్ని ఎకరాల్లో సాగుచేస్తే అంత మొత్తం రుణంగా తీసుకోవచ్చు. రూ.3 లక్షలవరకు రుణానికి రైతు ఎలాంటి ఆస్తి తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. రుణ చెల్లింపు కూడా పంట సాగుచేసిన నాలుగేండ్ల తర్వాతే విడతలవారీగా చెల్లించేలా అవకాశం కల్పించింది. సాగు ఖర్చులు ఎక్కువైన నేపథ్యంలో సబ్సిడీని కూడా పెంచాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ఉద్యానశాఖ సిఫార్సుచేసింది. వాస్తవానికి ఒక ఎకరా ఆయిల్ పామ్ సాగుకు మొదటి నాలుగేండ్లకు రూ.1.20 లక్షల పెట్టుబడి అవసరం అవుతుందని నాబార్డు అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సాగు ఖర్చు మొత్తం ప్రభుత్వమే వివిధ రూపాల్లో అందించేందుకు చర్యలు తీసుకున్నది. రాష్ట్రంలో వచ్చే నాలుగేండ్లలో ఏటా 2 లక్షల ఎకరాల చొప్పున 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. పామాయిల్కు మార్కెట్లో డిమాండ్ భారీగా పెరుగుతున్నది. ఇందుకు అనుగుణంగానే ఆయిల్ పామ్ గెలలకు కూడా ధర పెరుగుతున్నది. సాధారణంగా రూ.10 వేలకు క్వింటాలుగా ఉండే ఆయిల్ పామ్ గెల ధర ఇటీవల రికార్డుస్థాయిలో రూ.15,923 పలికింది. ఈ నేపథ్యంలో ఆయిల్ పామ్ సాగు రైతులకు లాభదాయకంగా మారనున్నది. దీని సాగుకు ఇప్పటికే ఆయా కంపెనీలకు జిల్లాలను కేటాయించింది. మహబూబాబాద్, సిద్దిపేట, జనగామ జిల్లాలను ఆయిల్ఫెడ్కు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాను మ్యాట్రిక్స్ కంపెనీకి, ఆదిలాబాద్ జిల్లాను ప్రీ యునిక్యూ కంపెనీకి, ములుగు జిల్లాను కేఎన్ బయోసైన్స్ కంపెనీకి కేటాయిస్తూ వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్రెడ్డి ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు.