మేడ్చల్, మే 23 (నమస్తే తెలంగాణ) : కొవిడ్ బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే దవాఖాన రిజిస్ట్రేషన్ను సైతం రద్దుచేస్తామని మేడ్చల్ జిల్లా వైద్యాధికారి మల్లిఖార్జునరావు తెలిపారు. ఇటీవల అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు కొవిడ్ బాధితుల కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు మేడ్చల్ జిల్లాలోని ఐదు ప్రైవేట్ దవాఖానలకు నోటీసులు జారీ చేశామన్నారు. బాధితుడికి అందించిన వైద్య సేవల అధారంగా బిల్లులను పరిశీలించి అధిక మొత్తంలో ఫీజు తీసుకున్నట్లు తెలితే దవాఖాన రిజిస్ట్రేషన్ రద్దు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. కొవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ కేంద్రాలకు సమాచారం అందించాలని లేదా సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.