లాగోస్: నైజీరియా బోకో హరామ్ మిలిటెంట్ గ్రూపు నేత అబూబాకర్ షేకూ తనకు తాను పేల్చుకుని మృతిచెందినట్లు ప్రత్యర్థి ఇస్లామిక్ మిలిటెంట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఆడియోను వాళ్లు రిలీజ్ చేశారు. రెండు గ్రూపుల మధ్య ఘర్షణ తర్వాత అబూబాకర్ తనకు తాను పేలుడు పదార్ధాలతో పేల్చుకున్నట్లు ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్(ఇస్వాప్) తెలిపింది. అబూబాకర్ షేకూ గతంలోనూ మృతిచెందినట్లు రిపోర్ట్లు వచ్చాయి. బోకో హరామ్ కానీ నైజీరియా ప్రభుత్వం కానీ అతని మరణాన్ని ద్రువీకరించలేదు. ఇస్వాప్ నేత అబూ ముసాద్ అల్ బర్నవి ఓ ఆడియా సందేశంలో మాట్లాడుతూ.. తనకు తాను పేల్చుకుని అబూబాకర్ మృతిచెందినట్లు తెలిపాడు. గతంలోనే అబూబాకర్ మృతిచెందినట్లు వార్తలు వచ్చినా నైజీరియా ఆర్మీ మాత్రం ద్రువీకరించచలేదు. అతని మృతిపై విచారణ చేపట్టేందుకు గతంలో ఆర్మీ నిర్ణయించింది. ఈశాన్య ప్రాంతంలో ఉన్న సంబిసా అడవుల్లో ఇస్వాప్ దళాలు దాడి చేసినప్పుడు అబూబాకర్ చనిపోయినట్లు ఓ కథనం వెలుబడింది. అనేక మార్లు అబూబాకర్ చనిపోయినట్లు వార్తలు వస్తున్నా.. అతను మళ్లీ దాడులు చేస్తూనే వణికిస్తున్నాడు.
అబూబాకర్ 2009 నుంచి నైజీరియాలో బోకోహరామ్ను నడిపిస్తున్నాడు. కిడ్నాప్లు, బాంబు పేలుళ్లు, జైళ్లపై దాడి లాంటి ఘటనలతో హడలెత్తించాడు. 2014 నుంచి షరియత్ చట్టాలను అమలు చేసేందుకు ఏకంగా గ్రామాలపైనే దాడిని ప్రారంభించాడు. బోకోహరమ్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 30 వేల మంది మరణించినట్లు తెలుస్తోంది. 2014లో స్కూల్ నుంచి పిల్లల్ని అపహరించిన తర్వాత బోకోహరామ్పై అందరి దృష్టి పడింది. అబూబాకర్ను గ్లోబల్ టెర్రరిస్టుగా అమెరికా ప్రకటించింది. ఏడు మిలియన్ల డాలర్ల నజరానా ప్రకటించింది.