ఇటీవల ఐపీఎల్-2021 సీజన్లో ఆడిన అగ్రశ్రేణి ఆస్ట్రేలియా క్రికెటర్లు వెస్టిండీస్, బంగ్లాదేశ్ పర్యటనల నుంచి వైదొలిగారు. ఈ ఏడాది చివర్లో టీ20 ప్రపంచకప్ జరగనుండగా జట్టు సన్నాహాల్లో భాగంగా ఈ రెండు దేశాల్లో ఆసీస్ టీమ్ పర్యటించనుంది.
‘వ్యక్తిగత కారణాల వల్ల తమను ఈ టూర్ కోసం పరిగణించవద్దని డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, గ్లెన్ మాక్స్వెల్, జే రిచర్డ్సన్, కేన్ రిచర్డ్సన్, మార్కస్ స్టాయినీస్, డేనియల్ సామ్స్ అభ్యర్థించారు. ఐపీఎల్ సమయంలో స్టీవ్ స్మిత్ మోచేతికి గాయం కావడంతో పూర్తిగా కోలుకోవడానికి విశ్రాంతినిచ్చినట్లు’ క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది. టీ20 వరల్డ్కప్ అక్టోబర్-నవంబర్ నెలల్లో జరగనుండగా నాలుగు నెలలపాటు ఆ జట్టులోని స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. విండీస్, బంగ్లా టూర్ కోసం 18 మందితో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం విడుదల చేసింది. జూలై 9 నుంచి 24 మధ్య ఆస్ట్రేలియా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. బంగ్లాదేశ్లో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్పై స్పష్టతరావాల్సి ఉంది.