ప్రముఖ తమిళ సినీ హాస్యనటుడు, ప్రకృతి ప్రేమికుడు వివేక్(59) శనివారం ఉదయం కన్నుమూశారు. శుక్రవారం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాసవిడిచారు. మూడున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో మూడు వందలకుపైగా సినిమాల్లో తనదైన శైలి హాస్యంతో ప్రేక్షకులను నవ్వించారు. అశ్లీలత, ద్వంద్వర్థాలు లేని చక్కటి హాస్యంతో అభిమానుల హృదయాల్లో నిలిచిపోయారు. సినిమాల్లోకి రాకముందు మద్రాస్ హ్యూమర్ క్లబ్లో స్టాండప్ కమెడియన్గా వివేక్ పని చేస్తుండేవారు.
ఆయనలోని ప్రతిభను గుర్తించిన దిగ్గజ దర్శకుడు బాలచందర్ తన సినిమాలకు స్క్రిప్ట్ రైటర్గా తీసుకున్నారు. గురువు బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ‘మనత్తిల్ ఉరుత్తి వెండూమ్’ సినిమాలో కథానాయిక సోదరుడి పాత్రతో వివేక్ నటప్రయాణం ఆరంభమైంది. తొలినాళ్లలో బాలచందర్ సినిమాల్లో ఎక్కువగా నటించారు. 1990 దశకంలో వీర, కాదల్ మన్నన్, వాలి, పోమగల్ ఊరవాలం లాంటి చిత్రాల్లో వివేక్ పండించిన హాస్యానికి మంచి పేరుప్రఖ్యాతలు లభించాయి. ఈ సినిమాల విజయాలతో అగ్రస్థాయి హాస్యనటుడిగా వివేక్ పేరుతెచ్చుకున్నారు. రన్, పార్తిబన్ కనువు, అన్నియన్, శివాజీ, ఉన్నూర్గే నాన్ ఇరుందాల్ చిత్రాలకు గాను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాల్ని అందుకున్నారు.
రజనీకాంత్, కమల్హాసన్ మొదలుకొని సూర్య, విజయ్, మాధవన్, ధనుష్ వంటి అగ్ర కథానాయకులందరితోనూ నటించారు. అపరిచితుడు, శివాజీ, బాయ్స్తో పాటు పలు అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు వివేక్ చేరువయ్యారు. వివేక్ నటించిన చివరి చిత్రం ‘ధరాల ప్రభు’ గత ఏడాది విడుదలైంది. ‘ఇండియన్-2’, ‘అరాన్మనై-3’ చిత్రీకరణ దశలో ఉన్నాయి. వివేక్ హఠాన్మరణంతో తమిళ చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. రజనీకాంత్, సూర్యతో పాటు పలువురు స్టార్స్ వివేక్తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు వివేక్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.సామాజికవేత్తగా, నేపథ్యగాయకుడిగా, టీవీ ప్రయోక్తగా వివేక్ రాణించారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం 2009లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
ప్రకృతి ప్రేమికుడు..
స్వతహాగా ప్రకృతి ప్రేమికుడైన వివేక్ పర్యావరణ పరిరక్షణ కోసం విశేషమైన కృషి చేశారు. దివంగత రాష్ట్రపతి అబ్దుల్కలాం మార్గదర్శనంలో ‘గ్రీన్కలాం’ పేరుతో మొక్కల పెంపకాన్ని చేపట్టారు వివేక్. ఈ కార్యక్రమం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడం కోసం పాటుపడిన ఆయన దాదాపు 32 లక్షలకుపైగా మొక్కల్ని నాటించారు. ప్లాస్టిక్ వ్యతిరేక పోరాటానికి బ్రాండ్ అంబాసిడర్గా కూడా వివేక్ పనిచేశారు.
వివేక్ సంకల్పాన్ని కొనసాగిస్తాం
ఎంపీ సంతోష్కుమార్
ప్రకృతి ప్రేమికుడు, హాస్యనటుడు వివేక్ హఠాన్మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎంపీ సంతోష్కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘గ్రీన్కలాం’ ప్రాజెక్ట్ ద్వారా కోటి మొక్కలు నాటాలని సంకల్పించిన వివేక్ 32 లక్షల మొక్కలు నాటారని ఆయన గుర్తుచేశారు. ప్రకృతిపట్ల, పర్యావరణ పరిరక్షణ పట్ల వివేక్ నిబద్ధత గొప్పదని తెలిపారు. కోటి మొక్కలు నాటాలనే వివేక్ కల నెరవేరకుండానే మరణించడం విచారకరమని పేర్కొన్నారు. వివేక్ లక్ష్యం అర్థాంతరంగా ఆగిపోకుండా మిగతా 68 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సంతోష్కుమార్ ప్రకటించారు. వివేక్ లక్ష్యసాధనను పూర్తిచేయడమే ఆయనకు అసలైన నివాళి అని తెలిపారు.