చిన్నకోడూరు/ దుబ్బాక, మే 7 : రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభు త్వం కృషి చేస్తున్నదని దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్రెడ్డి, జడ్పీటీసీ కడతల రవీందర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వనితారెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ బండి శ్రీలేఖరాజు , పీఏసీఎస్ చైర్మన్ శేర్ల కైలాశ్ అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిన బీజేపీకి రైతుల గురించి మాట్లాడే నైతికత లేదన్నారు. దుబ్బాకలో అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయిందన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సూచనల మేరకు శుక్రవారం దుబ్బాక మార్కెట్ యార్డు, హబ్షీపూర్, చేర్వాపూర్ గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉందని భరోసానిచ్చారు.
ఎక్కడా కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేపడుతున్నట్లు వివరించారు. అకాల వర్షానికి కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోతే బీజేపీ ఎమ్మెల్యే, అతడి అనుచరులు రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో యాసంగి పంటకు కాళేశ్వరం జలాలతో సాగునీటి కష్టాలను తీర్చింది సీఎం కేసీఆర్ కాదా అంటూ బీజేపీ నాయకులను ప్రశ్నించారు. అకాల వర్షాలకు ఇబ్బంది పడుతున్న రైతులకు ఎమ్మెల్యే రఘునందన్ అండగా నిలువాల్సింది పోయి, రాజకీయం చేస్తుండటం ఆయ న అవివేకానికి నిదర్శనమన్నారు. వైస్ చైర్మన్ అస్క రవి, టీఆర్ఎస్ నాయకులు రొట్టే రాజమౌళి, నరేశ్, దేవరాజ్, కృష్ణంరాజు తదితరులు ఉన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నదని జడ్పీ సీఈవో సుమతి అన్నారు. శుక్రవారం చిన్న కోడూరులోని ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించామన్నారు.