హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): పులుల సంరక్షణ, సంతతి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తున్నదని అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. అడవుల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడటంతోపాటు పర్యావరణ పరిరక్షణలో పులుల పాత్ర చాలా కీలకమని చెప్పారు. సోమవారం ఆయన అరణ్యభవన్ వద్ద పులుల సంరక్షణ కోసం జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్టీసీఏ) చేపట్టిన ‘ఇండియా ఫర్ టైగర్స్-ఏ ర్యాలీ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. పులులను సంరంక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని పేర్కొన్నారు.
ప్రభుత్వ చర్యల కారణంగా తెలంగాణలోని రెండు టైగర్ రిజర్వ్లలో పులుల సంఖ్య పెరిగిందని వివరించారు. పులుల సంరక్షణ ద్వారా అడవులకు రక్షణ లభిస్తుందని అటవీశాఖ పీసీసీఎఫ్ ఆర్ శోభ అన్నారు. రాష్ట్రంలోని అమ్రాబాద్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం టైగర్ రిజర్వ్ నుంచి వచ్చిన సిబ్బంది, వాహనాలతో ప్రారంభమైన ఈ ర్యాలీ కవ్వాల్ టైగర్ రిజర్వ్ వరకు, ఆ తర్వాత ఒడిశాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ వరకు కొనసాగుతుందని వివరించారు. కార్యక్రమంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి, పీసీసీఎఫ్ అధికారులు ఆర్ఎం డోబ్రియల్, లోకేశ్ జైస్వాల్, స్వర్గం శ్రీనివాస్, సిద్దానంద్ కుక్రేటీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.