న్యూఢిల్లీ : సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు, ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశ పరీక్షల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశంలో కేంద్రమంత్రులు రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్, స్మృతి ఇరానీ, ప్రకాశ్ జవదేకర్తో పాటు రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యాశాఖ మంత్రులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర పరీక్షా బోర్డు చైర్మన్లు పాల్గొననున్నారు. ఉదయం 11.30 గంటలకు వర్చువల్ విధానం సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణపై చర్చించి, సలహాలు సూచనలు తీసుకోనున్నారు. అలాగే విద్యార్థులు, తల్లిదండ్రులు సహా ఇతర వర్గాలు కూడా తమ విలువైన సలహాలు, సూచనలు పంపాలని ఇటీవల పోఖ్రియాల్ కోరారు.
కొవిడ్ విజృంభణ నేపథ్యంలో 10వ తరగతి పరీక్షల్ని రద్దు చేసిన సీబీఎస్ఈ.. 12వ తరగతి పరీక్షల్ని మాత్రం వాయిదా వేసింది. వాటి నిర్వహణకు ఉన్న సాధ్యాసాధ్యాలను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే వివిధ వర్గాలతో చర్చించేందుకు సిద్ధమైంది. అలాగే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, దాదాపు అన్ని రాష్ట్ర ఎడ్యుకేషన్ బోర్డులు, ఐసీఎస్ఈ తమ పన్నెండో తరగతి పరీక్షలను వాయిదా వేసుకున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ), ఇతర జాతీయ పరీక్షలను నిర్వహించే సంస్థలు కూడా ప్రవేశ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల నిర్వహణపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.