సిద్దిపేట : అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడిన బాపూజీ అని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ తొలి ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీలో సోమవారం కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. బాపూజీ నిస్వార్థ సేవలను స్మరించుకొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాధించడమే బాపూజీకి అసలైన నివాళి అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ కలలను నెరవేరుస్తూ తక్కువ కాలంలోనే అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధిపథంలో సీఎం కేసీఆర్ నడిపిస్తున్నారని పేర్కొన్నారు. సకల జనులు, సబ్బండవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూ జీ ఆశయాలను ప్రభుత్వం నెరవేరుస్తున్నదని పేర్కొన్నారు.
బాపూజీ జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. స్వరాష్ట్రంలో ఉద్యాన విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టి గౌరవించుకున్నామని మంత్రి తెలిపారు. చేనేత రంగంలో ప్రతిభావంతులైన కళాకారులకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులను అందజేస్తూ ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తున్నామని గుర్తు చేశారు.
ప్రభుత్వం వినూత్న పథకాలను అమలుచేస్తూ పద్మశాలీల అభ్యున్నతికి పాటుపడుతున్నదని పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప ప్రజాస్వామికవాది. గాంధీజీ స్ఫూర్తితో దేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, అవే విలువలను జీవితాంతం పాటిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాల్లో అన్ని దశల్లోనూ స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ దేశం గర్వించదగ్గ గొప్ప నేత అని కొనియాడారు. అణగారిన వర్గాల హకుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం జీవితమంతా కృషి చేశారని తెలిపారు.
బహుజన నేతగా దేశవ్యాప్తంగా పద్మశాలీలను సంఘటితం చేసిన ఘనత కొండా లక్ష్మణ్ బాపూజీకే దక్కిందని మంత్రి వెల్లడించారు. త్వరలో అందించనున్న డబుల్ బెడ్ రూం ఇండ్లలో నిరుపేద పద్మశాలీలకు ఇండ్లు ఇస్తామని, సొంత స్థలం ఉన్నవారికి త్వరలోనే ఇళ్లు కట్టుకునేందుకు నిధులిస్తామన్నారు. పద్మశాలీ ఫంక్షన్ హాల్ కు, రోడ్డు, ఇతర మౌలిక సదుపాయాలకు రూ. 50 లక్షల నిధుల ప్రొసీడింగ్ కాపీని మంత్రి పద్మశాలి సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్ కు అందించారు.
జోరువానలో సైతం..
జోరువానలో సైతం గజ్వేల్ పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ మేరకు ముందుగా కెమిస్ట్రీఅండ్ డ్రగిస్ట్ వారి కోసం రూ.20 లక్షలతో గజ్వేల్ ఏరియా మెడికల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి వాటికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను సభ్యులకు అందజేశారు. ఆ తర్వాత కవయిత్రి మొల్ల విగ్రహాన్ని ఆవిష్కరించి కుమ్మరి కుల సంఘం అభివృద్ధి కై రూ.25 లక్షల రూపాయల ప్రొసీడింగ్ కాపీ ఆ వర్గ సభ్యులకు అందజేశారు.
అనంతరం హౌసింగ్ బోర్డులో రూ.50 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల కోసం శంకుస్థాపన చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, ఆవరణలోని అంబేద్కర్ సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి సంబధిత ప్రొసీడింగ్ కాపీలను ఆ కుల సంఘ సభ్యులకు మంత్రి అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా శర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.