మహబూబాబాద్, మార్చి 6: అసలు సిసలైన హిందుత్వవాది సీఎం కేసీఆరేనని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ ఐక్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ స్పష్టం చేశారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మె ల్సీ టీఆర్ఎస్ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్రెడ్డి, వాణీదేవీలను గెలిపించేందుకు తెలంగాణ బ్రాహ్మణ సంఘం తరపున ఏకగ్రీవ మద్దతు ప్రకటిస్తున్నామని గంగు ఉపేంద్రశర్మ, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ పేర్కొన్నారు. శనివారం వారు మహబూబాబాద్లో ఆల్ ఇండియా బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది కొండపల్లి కేశవరావు నివాసంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలమని ప్రతి ఒక్క పార్టీ వారు ఓట్లకోసం వస్తున్నారని, ప్రశ్నించే గొంతుక ఒక్కటే ఉంటే సరిపోదని, పరిష్కరించే మంచి మనుసున్న వారు కావాలన్నారు. అలాంటి మంచి మనసున్న వారు కేసీఆరేనని వారు స్పష్టం చేశారు. బ్రహ్మానందరెడ్డి నుంచి కిరణ్కుమార్రెడ్డి వరకు అంతా బ్రాహ్మణులను వెక్కిరించారని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బ్రాహ్మణులకు పెద్దపీట వేసి దేవాలయాల్లోని అర్చకులతోపాటు 21 కులాల వారికి ఆర్థిక భరోసా కల్పించింది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమని వారు గుర్తుచేశారు. కాంగ్రెస్ నాయకుడు రేవంత్రెడ్డి తన స్థాయికి మించి మాట్లాడటం తగదన్నారు. పీవీ కుటుంబంలో నుంచి వచ్చిన వాణీదేవిని టీఆర్ఎస్ నిలబెడితే ఎందు కు మద్దతు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రతి బ్రాహ్మణుడు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపిస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు.