హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కృష్ణా, గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డుల పరిధిని నోటిఫై చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం మధ్యాహ్నం ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతరం కృష్ణా, గోదావరి జలాల పంపిణీ కోసం ఏపీ పునర్విభజన చట్టంలోని 85వ సెక్షన్ ప్రకారం కేంద్రం కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి నదీ జలాల యాజమాన్యబోర్డు (జీఆర్ఎంబీ)లను ఏర్పాటుచేసింది. చట్టంలోని సెక్షన్ 87 ప్రకారం బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదలచేయాల్సి ఉన్నది. గెజిట్ విడుదలైతే రెండు నదులపై ఇరు రాష్ర్టాల్లో ఉన్న ప్రాజెక్టులు బోర్డుల ఆధీనంలోకి వెళ్తాయి. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదల, విద్యుత్తు ఉత్పత్తి అంశాలన్నీ బోర్డుల నియంత్రణలోనే కొనసాగుతాయి. శుక్రవారం న్యూఢిల్లీలోని శ్రమ్శక్తి భవన్లో మధ్యాహ్నం 1.45 గంటలకు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల నియంత్రణ పరిధిని, అడ్మినిస్ట్రేషన్ విధి విధానాలకు సంబంధించిన గెజిట్ విడుదలవుతుంది. కాగా, రెండు రాష్ర్టాల మధ్య నదీ జలాలను పునః పంపిణీ చేసిన తర్వాతే బోర్డుల పరిధిని నిర్ణయించాలని తెలంగాణ మొదట్నుంచీ డిమాండ్ చేస్తున్నది.