సిద్దిపేట : రాష్ట్రంంలో గొల్ల, కురుమల క్షేమం గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని మల్లిఖార్జున స్వామి ఫంక్షన్ హాల్లో పశు వైద్య, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకల్లో నట్టల నివారణకు ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులవృత్తులకు చేయూతను అందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు, పాలకులు ఎవ్వరూ గొల్ల, కురుమల అభివృద్ధి గురించి పట్టించుకోలేరన్నారు. ప్రభుత్వం రూ. 5 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన మొదటి విడత గొర్రెల పంపిణీ మంచి ఫలితం ఇచ్చిందన్నారు. 2వ విడత పంపిణీ కోసం సర్కారు రూ.6 వేల కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.
పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని గొర్రెల యూనిట్ ధరను రూ.1.25 లక్షల నుంచి 1.75 లక్షలకు సీఎం పెంచారని చెప్పారు. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని జిల్లా పశు వైద్యాధికారులకు సూచించారు. పంపిణీ చేసే గొర్రెలకు కొనుగోలు చేసిన ప్రాంతంలోనే బీమా పత్రాలను అందజేసేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గొర్రెలు చనిపోతే సకాలంలో బాధితులకు బీమా అందేలా చూడాలని ఆదేశించారు. పెరిగిన జీవాలకు అనుగుణంగా గ్రాసం కొరత రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు. రైతులకు సబ్సిడీ పై గడ్డి విత్తనాలను సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. జీవాల వద్దకే వైద్యసేవలు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రారంభించిన సంచార పశువైద్యశాలలు బాగా పనిచేస్తున్నాయన్నారు.
గొర్రెల పెంపకందారులు గొర్రెలను అమ్ముకునేందుకు, కొనుగోలు చేసేందుకు అన్నిరకాల సౌకర్యాలు, వసతులతో కూడిన మార్కెట్ల నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఖమ్మం, పెద్దపల్లి, వనపర్తి తదితర జిల్లాలలో గొర్రెల మార్కెట్ల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రతి జిల్లా కేంద్రంలో గొర్రెల మార్కెట్ నిర్మాణానికి అవసరమైన 5 ఎకరాల భూమిని ఆయా జిల్లా కలెక్టర్ల సహకారంతో గుర్తించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్థలం సమకూరిస్తే గజ్వేల్లో గొర్రెల మార్కెట్ నిర్మాణం చేపడతామని తెలిపారు. మేత కోసం అడవుల్లో గొర్రెలను తిప్పవచ్చన్నారు. ఇదివరకే ప్రభుత్వం ఈ విషయంలో జీవో జారీ చేసిందన్నారు.
ఈ సమావేశంలో అటవీ అభివృద్థి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి. వెంకట్రామిరెడ్డి, పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, గడా ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఆర్డీఓ విజయేంద్ర రెడ్డి, జిల్లా పశు సంవర్ధక అధికారి సత్య ప్రసాద్, ఎంపీపీ లలిత, జెడ్పీటీసీ బాలమల్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.