హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణకు పూనుకుంటున్నదని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మంగళవారం హైదరాబాద్లో విద్యుత్తు సంస్థ ల ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించారు. ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్లోని కార్పొరేట్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అంజయ్య మాట్లాడుతూ.. విద్యుత్తు వ్యవస్థలను అదాని, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడానికే కొత్త విద్యుత్తు చట్టాలు తెస్తున్నారని దుయ్యబట్టారు. కొత్త చట్టం అమలైతే వినియోగదారులు, రైతులు, ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తంచేశారు.
తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కే వినోద్కుమార్ మాట్లాడుతూ.. విద్యుత్తు సంస్థలు ప్రభుత్వ పరిధిలో ఉంటేనే కరెంటు సరసమైన ధరకు లభిస్తుందని చెప్పారు. కొత్తచట్టంతో విద్యుత్తు వినియోగం భారంగా మారుతుందన్నారు. ఖైరతాబాద్లోని విద్యుత్తుసౌధ ఎదుట చేపట్టిన ఆందోళనలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు శివాజీ, కే ప్రకాశ్, జాన్సన్, శెట్టి, తుల్జారాంసింగ్ తదితరులు పాల్గొన్నారు. మింట్ కాంపౌండ్లోని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ విద్యుత్తు ఉద్యోగుల, ఇంజనీర్ల సమన్వయ కమిటీ ప్రతినిధులు రత్నాకర్, శ్యాం మనోహర్ తదితరులు పాల్గొన్నారు.