హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): విభజన చట్టంలోని కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై నిర్లక్ష్యం తగదని టీఆర్ఎస్ లోక్సభాపక్షనేత నామా నాగేశ్వరరావు అన్నారు. కోచ్ ఫ్యాక్టరీపై ఏడేండ్లుగా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో పార్లమెంట్ సభ్యులతో దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా సమావేశం నిర్వహించారు. తెలంగాణకు చెందిన 16 మంది లోక్సభ, ఇద్దరు రాజ్యసభ సభ్యులతోపాటు కర్ణాటక నుంచి ఇద్దరు ఎంపీలు హాజరయ్యా రు.
ఆయా నియోజకవర్గాలవారీగా పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టు పనులు, వాటి పురోగతి, నిధుల కేటాయింపు వంటి అంశాలపై చర్చించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఎంపీ నామా కోరారు. భద్రాచలం-కొవ్వూరు రైల్వే పనులను విస్తరించాలని సూచించారు. పాండురంగాపురం- సారపాక రైల్వేలైనును నిర్మించాలని, దీనికి 2011 రైల్వే బడ్జెట్లో రూ.79.82 కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. జీఎం గజానన్ మాల్యా మాట్లాడుతూ.. కాజీపేట-బల్లర్షా, కాజీపేట-కొండపల్లి మార్గంలో మూడో రైల్వేలైను పనులను చేపట్టినట్టు తెలిపారు.
ఈ ప్రాజెక్టును పూర్తిగా రైల్వే నిధులతోనే చేపట్టినట్టు స్పష్టంచేశారు. ఎంపీలకు చెందిన నియోజకవర్గాలవారీగా పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల గురించి తెలియచేశారు. కాజీపేట-విజయవాడ రైల్వేలైను, మనోహరాబాద్-గజ్వేల్-కొత్తపల్లి నూతన రైల్వేలైను, అక్కన్నపేట-మెదక్ రైల్వేలైను, ఫలక్నుమా-డోన్ డబ్లింగ్ ప్రాజెక్టు పనులు వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. కొవిడ్ తర్వాత 85 శాతం ఎక్స్ప్రెస్ రైళ్లు, 85 ప్యాసింజర్ రైళ్లు, 55 ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరించినట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఎంపీలు మాలోతు కవిత, రంజిత్రెడ్డి, మన్నె శ్రీనివాస్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, పీ రాములు, బీ వెంకటేశ్, బీబీ పాటిల్, కేఆర్ సురేశ్రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, అసదుద్దీన్ ఒవైసీ, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అరవింద్, కర్ణాటక ఎంపీలు రాజా అమ్రేశ్వర్నాయక్, డాక్టర్ ఉమేశ్జాదవ్ పాల్గొన్నారు.