అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ పిన్ని నర్మదాబెన్ (80) కరోనా బారినపడి కన్నుమూశారు. గత పది రోజుల కిందట కరోనా బారినపడగా అహ్మదాబాద్లోని సివిల్ హాస్పిటల్కు తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ తెలిపారు. కరోనా సోకడంతో సివిల్ హాస్పిటల్లో చేర్చామని, చికిత్స పొందుతూ కన్నుమూశారని పేర్కొన్నారు. ప్రధాని తండ్రి దామోదర్ దాస్ సోదరుడు జగ్జీవన్ దాస్. ఆయన భార్యనే నర్మదాబెన్. జగ్జీవన్ దాస్ చాలా సంవత్సరాల క్రితమే మరణించారని ప్రహ్లాద్ మోడీ తెలిపారు. ఆమె మృతిపై బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా సంతాపం ప్రకటించారు.